Suryapet: సూర్యాపేట టౌన్ ప్లానింగ్ ఆఫీసర్పై ఏసీబీ దాడి!
Suryapet: సూర్యాపేట టౌన్ ప్లానింగ్ అధికారి సోమయ్య నివాసాలు, ఆఫీసులపై ఏసీబీ దాడులు. రూ.3.54 కోట్ల అక్రమాస్తులను గుర్తించి, జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు.
Suryapet: సూర్యాపేట టౌన్ ప్లానింగ్ ఆఫీసర్పై ఏసీబీ దాడి!
Suryapet: ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై సూర్యాపేట మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారి వి. సోమయ్యపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేసు నమోదు చేసింది.
నల్గొండ రేంజ్ ఏసీబీ అధికారులు గురువారం సోమయ్య నివాసం, కార్యాలయంతో పాటు సూర్యాపేట, హైదరాబాద్ లోని ఆయన బంధువులు, సహచరులకు సంబంధించిన మొత్తం 8 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.
సోదాల్లో భారీగా ఆస్తులకు సంబంధించిన పత్రాలు బయటపడ్డాయని ఏసీబీ అధికారులు వెల్లడించారు. సూర్యాపేట జిల్లాలో 3 ఎకరాల 3 గుంటల వ్యవసాయ భూమి, సూర్యాపేట, హయత్ నగర్ పరిధిలో 5 నివాస ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. వీటిలో ఒక జీ+1 భవనం, ఒక జీ+2 భవనం, ఒక జీ+4 భవనం, ఒక పెంట్ హౌస్, రెండు గ్రౌండ్ ఫ్లోర్ ఇళ్లు ఉన్నాయి. అలాగే సూర్యాపేట పరిధిలో 8 ఓపెన్ ప్లాట్లు కూడా ఉన్నాయి. వీటి మార్కెట్ విలువ అధికారిక విలువ కంటే చాలా ఎక్కువగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
సోదాల్లో రూ.4,63,990 నగదు, బ్యాంకు ఖాతాల్లో రూ.13 లక్షల నిల్వలు గుర్తించారు. 709 గ్రాముల బంగారు ఆభరణాలు, 1,750 గ్రాముల వెండి ఆభరణాలు లభించాయి. వీటి విలువ సుమారు రూ.20 లక్షలుగా అంచనా వేశారు. సోమయ్యకు చెందిన రెండు కార్లు, మూడు ద్విచక్ర వాహనాలు గుర్తించారు. వీటి విలువ సుమారు రూ.25.20 లక్షలు. ఇంట్లోని గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువుల విలువ సుమారు రూ.11 లక్షలుగా అంచనా వేశారు.
బంగారాన్ని తాకట్టు పెట్టి బ్యాంకు ద్వారా సుమారు రూ.49 లక్షల రుణం పొందినట్లు కూడా ఏసీబీ గుర్తించింది.
ఇప్పటివరకు గుర్తించిన ఆస్తులు, నగదు, బంగారం, వాహనాలు అన్నీ కలిపి మొత్తం విలువను రూ.3,54,36,490 గా ఏసీబీ ప్రాథమికంగా అంచనా వేసింది. అనంతరం సోమయ్యను హైదరాబాద్ లోని ప్రత్యేక ఏసీబీ కోర్టు ఎదుట హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించనున్నట్లు అధికారులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.




