Cult Classic Love Story: విలన్కు రియల్ బెదిరింపులు...క్లైమాక్స్ మార్చాలని మేకర్స్కి లేఖలు
బాలీవుడ్లో సినిమా ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఏక్ దుజే కే లియే సినిమాలో నటించిన విలన్కు రియల్గా బెదిరింపులు వచ్చాయట.
Cult Classic Love Story: ప్రేక్షకులపై సినిమా ప్రభావం ఎంతలా ఉంటుందో చెప్పడానికి ఎన్నో సినిమాలు ఉన్నాయి. వెండితెరపై నటులు చూపించే నటనను నిజం అని నమ్మి వారిపై అభిమానాన్ని లేదా క్రోధాన్ని పెంచుకుంటారు. ఇలాంటి వింత సంఘటన ఒకటి 1981లో వచ్చిన ఓ ఐకానిక్ సినిమా విషయంలో జరిగింది. అంతేకాదు, ఈ సినిమాను కేవలం రూ. 10 లక్షల బడ్జెట్లో పూర్తిచేస్తే ఏకంగా రూ. 10 కోట్లకు పైగా వసూలు చేసి ఆరోజుల్లో రికార్డు సృష్టించింది. పలు థియేటర్లలో నాలుగేళ్లకు పైగా నిరంతరాయంగా ప్రదర్శించబడింది. ఆ సినిమానే ఏక్ దుజే కేలియే. ఈ సినిమాలోని క్లైమాక్స్ని చూసి జనాలు తట్టుకోలేకపోయారు. విలన్ పాత్రలో నటించిన నటుడిని చంపేస్తామని బెదిరింపు లేఖలు రాయడం అప్పట్లో సంచలనంగా మారింది.
10 లక్షల బడ్జెట్... 10 కోట్ల వసూళ్లు!
లెజెండరీ డైరెక్టర్ కె. బాలచందర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఏక్ దుజే కే లియే' చిత్రం ఒక క్లాసిక్ లవ్ స్టోరీ. అయితే ఈ సినిమా విడుదల కాకముందు పంపిణీదారులు దీనిని కొనడానికి అస్సలు ముందుకు రాలేదు. సౌత్ హీరో హిందీలో సక్సెస్ అవుతాడా అనే అనుమానమే దానికి కారణం. కానీ థియేటర్లలోకి వచ్చాక ఈ సినిమా బాక్సాఫీస్ను షేక్ చేసింది. అప్పటికే హిందీలో బడాహీరోలు ఎందరో ఉన్నారు. కొత్త వారికి అవకాశం రావడమే కష్టం. అందులోనూ సౌత్ నుంచి హీరో వస్తే ఎలా రిసీవ్ చేసుకుంటారోనని భయపడ్డారు. కాగా, ఈ సినిమా రూ. 10 కోట్ల బడ్జెట్తో తీయగా ఏకంగా రూ. 10 కోట్లకు పైగా వసూలు చేయడమే కాకుండా కొన్ని థియేటర్లలో ఏకంగా నాలుగు సంవత్సరాలకు పైగా ఆడింది. కమల్ హాసన్, రతి అగ్నిహోత్రి జంట దేశవ్యాప్తంగా బెస్ట్ జోడీగా గుర్తింపు పొందారు.
విలన్ను వెంటాడిన రియల్ బెదిరింపులు
ఈ సినిమాలో ప్రముఖ నటుడు రాకేష్ బేడీ ఒక కీలకమైన నెగటివ్ షేడ్ ఉన్న పాత్ర పోషించారు. కథ ప్రకారం కమల్ హాసన్, రతి అగ్నిహోత్రిల అమర ప్రేమకథ మధ్యలోకి వచ్చి వారి మరణానికి ఇండైరెక్ట్గా కారణమవుతాడు. ఈ ట్రాజిక్ క్లైమాక్స్ ప్రేక్షకులను తీవ్రమైన మానసిక వేదనకు గురిచేసింది. ఇటీవల రాకేష్ బేడీ మ్యాషబుల్ ఇండియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఆనాటి భయంకరమైన అనుభవాలను పంచుకున్నాడు. సినిమా విడుదలయ్యాక రాకేష్ బేడీకి రోజుకు వందలాది లేఖలు వచ్చేవట. ప్రేమికులు ఇద్దరి మరణానికి తానే కారణమని, దానికి ప్రతిగా తనని చంపేస్తామని బెదిరిస్తూ ఎన్నో లేఖలు వచ్చాయని రాకేష్ బేడీ తెలిపారు. ఆ సమయంలో నిజంగా బయటకు రావడానికి భయపడినట్టుగా తెలిపాడు. అంతేకాదు, క్లైమాక్స్లో హీరో హీరోయిన్లు ఇద్దరూ చనిపోయే ముగింపు నచ్చక వారిద్దరినీ కలిపి సినిమాను హ్యీపీ ఎండ్గా మార్చాలని మేకర్స్పై కూడా అభిమానులు ఒత్తిడి తెచ్చారు.
టెలివిజన్ స్టార్కు దక్కిన క్రేజ్
రాకేష్ బేడీ అంటే వాస్తవానికి 'శ్రీమాన్ శ్రీమతి', 'యే జో హై జిందగీ' వంటి పాపులర్ కామెడీ షోలతో బుల్లితెరపై నవ్వులు పూయించిన నటుడు. ధురందర్ సినిమాతో రాకేష్ బేడీ మరోసారి వార్తల్లోకి వచ్చాడు. ఒక నటుడు నెగటీవ్ రోల్ చేస్తే జనాలు అంతలా రియాక్ట్ అయ్యారంటే... ఆ పాత్రలో ఆయన ఎంతలా పరకాయ ప్రవేశం చేసి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు. సినిమా అంటే కేవలం రెండు మూడు గంటల థియేటర్లో కూర్చొని ఎంజాయ్ చేసి ఆ తరువాత మరిచిపోయేది కాదు. సామాన్యుల ఎమోషన్స్తో ఎంత బలంగా ముడిపడి ఉంటుందో చెప్పడానికి ఈ ఏక్ దుజే కే లియే సినిమానే ఓ ఉదాహరణ. ఇలాంటి సినిమాలు ఇండస్ట్రీలో మళ్లీ రావాలని బలంగా కోరుకుందాం.




