చిరంజీవి విజేతను మించేలా అనుకున్నా...మెరుపు వేగంతో ఆగిపోయిన రామ్చరణ్ సినిమా
టాలీవుడ్ సినిమా చరిత్రలో సెట్స్ మీదకు వెళ్లకముందే సన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా మెరుపు. మెగా పవర్స్టార్ రామ్చరణ్, డైరెక్టర్ ధరణి కాంబినేషన్లో ఈ సినిమాను అనౌన్స్ చేశారు.
Ram Charan’s Merupu: టాలీవుడ్ సినిమా చరిత్రలో సెట్స్ మీదకు వెళ్లకముందే సన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా మెరుపు. మెగా పవర్స్టార్ రామ్చరణ్, డైరెక్టర్ ధరణి కాంబినేషన్లో ఈ సినిమాను అనౌన్స్ చేశారు. మగధీర తరువాత చరణ్ చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. కానీ, ఈ సినిమా కేవలం 15 రోజులు మాత్రమే షూటింగ్ జరుపుకుంది. ఆ తరువాత వివిధ కారణాల వలన అటకెక్కింది.
చిరంజీవి 'విజేత'ను మించేలా ప్లాన్.. కానీ
రామ్ చరణ్ తన తండ్రి నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘విజేత’ను స్ఫూర్తిగా తీసుకుని, ఫుట్బాల్ నేపథ్యంలో ‘మెరుపు’ సినిమాను పట్టాలెక్కించారు. 2010 ఏప్రిల్ 30న గ్రాండ్గా పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవే స్వయంగా క్లాప్ ఇచ్చారు. అయితే, అద్భుతంగా సాగుతుందనుకున్న ఈ ప్రయాణం మధ్యలోనే ఆగిపోవడానికి ప్రధానంగా బడ్జెట్ మరియు క్వాలిటీ సమస్యలే కారణం. ఈ సినిమా ఫుట్బాల్ కోచ్గా యాక్షన్ కింగ్ అర్జున్ని అనుకున్నారు. క్యాస్టింగ్ లైనప్ అద్భుతంగా ఉన్నా చివరకు ముందుకు సాగకుండా ఆగిపోయింది.
ఖర్చు హద్దులు దాటడం.. నిర్మాత వెనకడుగు
సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్పై ఆర్.బి. చౌదరి ఈ చిత్రాన్ని 35 కోట్ల రూపాయలతో నిర్మించాలని ప్లాన్ చేశారు. కానీ దర్శకుడు ధరణి మేకింగ్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా బడ్జెట్ను మరో 10 కోట్లు పెంచేశారు. అదే సమయంలో రామ్ చరణ్ నటించిన ‘ఆరెంజ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో, భారీ బడ్జెట్ పెట్టడానికి నిర్మాత భయపడ్డారు. సినిమా అనౌన్స్ చేసిన తరువాత బడ్జెట్ కారణంగా ఆగిపోతే బాగుండదని భావించి ఎలాగైనా సినిమా పూర్తిచేయాలని అనుకున్నారు. చిరంజీవి రిక్వెస్ట్ మేరకు సినిమా షూటింగ్ మొదలుపెట్టినా... ఆగిపోవడం ఆశ్చర్యకరం.
చిరంజీవి అసంతృప్తి.. 'రచ్చ' ఎంట్రీ
చిరంజీవి మాట మేరకు చెన్నై పరిసర ప్రాంతాల్లో సినిమా షూటింగ్ 15 రోజులపాటు జరుపుకుంది. ఈ షెడ్యూల్ కోసమే ఏకంగా 8 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. తీసిన సీన్స్ చూసిన చిరంజీవికి అవుట్ పుట్ ఏమాత్రం నచ్చలేదు. స్క్రిప్ట్లో మార్పులు చేయాలని సూచించినా, పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడంతో చివరకు ఆ ప్రాజెక్టును నిలిపివేయడమే ఉత్తమమని మెగాస్టార్ నిర్ణయించారు. ఆ సమయంలోనే అదే బ్యానర్లో తక్కువ బడ్జెట్లో కమర్షియల్ ఎలిమెంట్స్తో ‘రచ్చ’ సినిమా లైన్లోకి రావడంతో ‘మెరుపు’ కథ అక్కడితో ముగిసిపోయింది. స్పోర్ట్స్ డ్రామా కథ బాగున్నా...ఊహించని బడ్జెట్, క్వాలిటీలేని మేకింగ్ కారణంగా సినిమా ఆగిపోయింది.
హీరోయిన్ల మార్పులు కూడా ఒక కారణమే!
మొదట షాజన్ పదామ్సీని అనుకున్నా, ఫోటోషూట్ తర్వాత ఆమెను పక్కనపెట్టి కాజల్ అగర్వాల్ను ఎంపిక చేశారు. అయితే షూటింగ్ ఆలస్యం కావడం వల్ల కాజల్ కూడా తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇలియానా పేరు వినిపించినా, అప్పటికే బడ్జెట్ ఇబ్బందుల వల్ల సినిమా ఆగిపోయే దశకు చేరుకుంది. యాక్షన్ కింగ్ అర్జున్ ఫుట్బాల్ కోచ్గా నటించాల్సిన ఈ క్రేజీ ప్రాజెక్ట్, మెగా ఫ్యాన్స్కు ఒక తీరని కోరికగా మిగిలిపోయింది. ఆనాడు ఫుట్బాల్ స్పోర్ట్స్ డ్రామాతో సినిమా చేయలేకున్నా...ఇప్పుడు పెద్ది రూపంలో క్రెకెట్ మ్యాచ్ బ్యాక్డ్రాప్తో రామ్చరణ్ సినిమా చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి అంచనాలను అందుకుంటుందో చూడాలి.




