Actress Sanchita Ugale: బాలీవుడ్కి శాపంగా మారిన ఆ తేదీ..ఒకరి తర్వాత ఒకరు చనిపోతున్నారే..!
Actress Sanchita Ugale: ప్రముఖ హిందీ టెలివిజన్ నటి, ‘కుంకుమ భాగ్య’ ఫేమ్ సంచిత ఉగాలే (22) ముంబైలో ఆత్మహత్యకు పాల్పడటం పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది.
Actress Sanchita Ugale: బాలీవుడ్కి శాపంగా మారిన ఆ తేదీ..ఒకరి తర్వాత ఒకరు చనిపోతున్నారే..!
Sushant Singh Rajput: సినిమా, టీవీ రంగాల్లో వరుస విషాదాలు అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. నిన్నటివరకు వెండితెరపై, బుల్లితెరపై నవ్వుతూ కనిపించిన నటీనటులు.. హఠాత్తుగా అనంతలోకాలకు వెళ్లిపోతుండటం ఇండస్ట్రీని కలవరపెడుతోంది. తాజాగా ప్రముఖ హిందీ టెలివిజన్ నటి సంచిత ఉగాలే (22) ముంబైలో ఆత్మహత్య చేసుకోవడం బాలీవుడ్ వర్గాలను ఒక్కసారిగా కుదిపేసింది. ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఒక యువ నటి ఇలా అర్థాంతరంగా తనువు చాలించడం అందరినీ కలచివేస్తోంది.
ముంబైలోని నలసోపరా ప్రాంతంలో తన కుటుంబంతో కలిసి నివసిస్తున్న సంచిత.. ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ప్రాణాలు విడిచారు. కుటుంబ సభ్యులు బయటకు వెళ్లి వచ్చేసరికి ఆమె అపస్మారక స్థితిలో కనిపించడంతో ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. అచోలే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఆదివారం సాయంత్రం 6.30 నుండి 7.30 గంటల మధ్య ఈ ఘోరం జరిగి ఉండవచ్చని ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
ఈ విషాద సమయంలో సంచిత సోదరుడు ఆకాశ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. సరిగ్గా ఆరేళ్ల క్రితం అంటే 2020 జూన్ 14న బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. చిత్ర పరిశ్రమలోని ఒత్తిడిని తట్టుకోలేకే ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారనే వాదనలు ఉన్నాయి.
అయితే, సంచిత కూడా సుశాంత్ చనిపోయిన జూన్ 14వ తేదీనే ఆత్మహత్య చేసుకోవడం, దానికి ఒకరోజు ముందు ఆమె తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో 'ఇట్స్ అగైన్ 14 జూన్' అంటూ ఒక రీల్ను షేర్ చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. గతంలో జరిగిన విషాదాన్ని గుర్తు చేస్తూ ఆమె ముందే హింట్ ఇచ్చిందా అనే కోణంలోనూ, పరిశ్రమ ఒత్తిడి వల్లే తన సోదరి చనిపోయిందని ఆకాశ్ వ్యక్తంచేసిన అభిప్రాయం అందరినీ ఆలోచింపజేస్తోంది. దీంతో జూన్ 14 అనేది బాలీవుడ్కు ఒక బ్లాక్ డేగా మిగిలిపోయింది.
వయసు చిన్నదే అయినా, సంచిత తన నటనతో టీవీ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ముఖ్యంగా పాపులర్ సీరియల్ ‘కుంకుమ భాగ్య’లో దియా టాండన్ పాత్రలో ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది. దీనితో పాటు ‘వాగ్లే కీ దునియా’, ‘దిల్వాలీ దుల్హా లే జాయే’ వంటి ధారావాహికల్లోనూ వైవిధ్యమైన పాత్రలు పోషించి మెప్పించారు. వెండితెరపై అవకాశాలు వస్తున్నప్పటికీ, తనకు గుర్తింపు తెచ్చిన బుల్లితెరను ఎప్పటికీ మర్చిపోనని, ఈ రంగానికి ఎప్పుడూ కృతజ్ఞతురాలినై ఉంటానని ఆమె గతంలో ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆ మాటలను గుర్తు చేసుకుంటూ తోటి నటీనటులు కన్నీరుమున్నీరవుతున్నారు.
కెరీర్ పరంగా ఎంతో ఆశాజనకంగా సాగుతున్న సంచిత ఇలాంటి తీవ్ర నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన కారణాలు ఉండే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ క్రమంలోనే సంచిత ఉగాలే మృతిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ యువ నటి మరణానికి దారితీసిన పరిస్థితులను వెలికితీయాలని పోలీసులను కోరింది. నవ్వుతూ కనిపించే సెలబ్రిటీల వెనుక ఉండే మానసిక ఒత్తిడిపై ఈ ఘటన మరోసారి చర్చకు తెరలేపింది.




