తెలంగాణ ఎగ్జిబిటర్ల సంచలనం: 'పెద్ది'కి థియేటర్ల కష్టాలు తప్పవా?
ప్రెస్ మీట్లో ఎగ్జిబిటర్లు తీసుకున్న నిర్ణయం టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ రాబోయే చిత్రం ‘పెద్ది’ బాక్సాఫీస్ ప్రయాణంపై నీలినీడలు కమ్ముకునేలా చేస్తోంది
తెలంగాణ చిత్ర పరిశ్రమలో థియేటర్ల యజమానులు (ఎగ్జిబిటర్లు) , నిర్మాతల మధ్య మొదలైన ఆదాయ పంపకాల వివాదం ఇప్పుడు తీవ్ర రూపం దాల్చింది. నేడు జరిగిన ప్రెస్ మీట్లో ఎగ్జిబిటర్లు తీసుకున్న నిర్ణయం టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ రాబోయే చిత్రం ‘పెద్ది’ బాక్సాఫీస్ ప్రయాణంపై నీలినీడలు కమ్ముకునేలా చేస్తోంది.
రెంటల్ సిస్టమ్ వద్దు.. పర్సెంటేజీయే ముద్దు!
దశాబ్దాలుగా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో కొనసాగుతున్న రెంటల్ (అద్దె) విధానం వల్ల థియేటర్లు తీవ్ర నష్టాల్లో ఉన్నాయని ఎగ్జిబిటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల విడుదలైన మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వర ప్రసాద్ గారు’, అల్లు అర్జున్ ‘పుష్ప 2’ వంటి భారీ చిత్రాల ఉదాహరణలను వారు ప్రస్తావించారు. ఈ సినిమాలు వందల కోట్ల వసూళ్లు సాధించినప్పటికీ, అద్దె విధానం వల్ల థియేటర్లకు ఆశించిన లాభాలు రాలేదని, కేవలం నిర్మాతలు మాత్రమే లాభపడుతున్నారని వారు ఆరోపించారు. అందుకే మల్టీప్లెక్స్ల తరహాలో ఆదాయంలో వాటా ఇచ్చే పర్సెంటేజీ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
పెంచిన టికెట్ ధరలపై శిరీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఎస్వీసీ (SVC) అధినేత శిరీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. ప్రభుత్వం నుంచి జీవోలు పొంది టికెట్ ధరలు పెంచినప్పటికీ, ఆ పెంచిన ధరలతో సినిమాలను ప్రదర్శించకూడదని ఎగ్జిబిటర్లు ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ నిర్ణయం అమలైతే, పెద్ద సినిమాల వసూళ్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.
రామ్ చరణ్ ‘పెద్ది’ కి చిక్కులు తప్పవా?
రామ్ చరణ్ - బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న ‘పెద్ది’ చిత్రం జూన్ 4, 2026న విడుదల కావాల్సి ఉంది. నిజాం ఏరియాలో ఈ చిత్ర పంపిణీ బాధ్యతలను మైత్రీ మూవీ మేకర్స్ తీసుకుంది. అయితే, మైత్రీ నిర్మాతలు ఇప్పటికే పర్సెంటేజీ విధానాన్ని వ్యతిరేకిస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు.
ఒకవైపు థియేటర్ల మనుగడ కోసం ఎగ్జిబిటర్లు ఖచ్చితంగా పర్సెంటేజీ విధానం అమలు చేయాలని పట్టుబడుతుండగా, మరోవైపు మైత్రీ మూవీ మేకర్స్ వంటి అగ్ర నిర్మాణ సంస్థలు మాత్రం పాత అద్దె విధానాన్నే కొనసాగించాలని గట్టిగా కోరుతున్నాయి. ఈ ఆదాయ పంపకాల గొడవకు తోడు, ఒకవేళ ప్రభుత్వం అనుమతించినా సరే, టికెట్ ధరలు పెంచితే సినిమాలను తమ థియేటర్లలో ప్రదర్శించబోమని ఎగ్జిబిటర్లు హెచ్చరించడం ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో సంచలనంగా మారింది. ఈ ప్రతిష్టంభన వల్ల అగ్ర హీరోల సినిమాల వసూళ్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.
ఈ ప్రతిష్ఠంభన ఇలాగే కొనసాగితే, ‘పెద్ది’ చిత్రం నిజాం రీజియన్లో సాధారణ టికెట్ ధరలతోనే విడుదల కావాల్సి రావచ్చు లేదా థియేటర్ల కొరతను ఎదుర్కోవాల్సి రావచ్చు. మెగా అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాకు ఈ థియేటర్ వివాదం పెద్ద సవాలుగా మారింది.




