సరికొత్త త్రీడీ ఎక్స్‌పీరియన్స్‌తో వస్తున్న 'హనుమాన్'... థియేటర్లలో చూడాల్సిందే!

Hanuman: టాలీవుడ్‌లో చిన్న సినిమాగా విడుదలై గ్లోబల్ స్థాయిలో వసూళ్ల సునామీ సృష్టించిన విజువల్ వండర్ 'హనుమాన్'.

Srinivas Rao
Published on: 16 May 2026 5:32 PM IST
Hanuman
X

సరికొత్త త్రీడీ ఎక్స్‌పీరియన్స్‌తో వస్తున్న 'హనుమాన్'... థియేటర్లలో చూడాల్సిందే!

Hanuman: టాలీవుడ్‌లో చిన్న సినిమాగా విడుదలై గ్లోబల్ స్థాయిలో వసూళ్ల సునామీ సృష్టించిన విజువల్ వండర్ 'హనుమాన్'. యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ, యంగ్ హీరో తేజ సజ్జా కలయికలో వచ్చిన ఈ సూపర్ హీరో ఫాంటసీ చిత్రం పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించడమే కాకుండా, ప్రతిష్టాత్మక జాతీయ అవార్డును కూడా గెలుచుకుని తెలుగు సినిమా సత్తాను చాటిన ఈ బ్లాక్‌బస్టర్ చిత్రం ఇప్పుడు ప్రేక్షకులకు మరో అద్భుతమైన థియేట్రికల్ అనుభూతిని అందించడానికి సిద్ధమైంది. ఈ సినిమాను త్రీడీ (3D) ఫార్మాట్‌లో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రీ-రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

జూన్ 25న త్రీడీ జాతర ప్రారంభం

తాజా సమాచారం ప్రకారం, ఈ అద్భుతమైన సూపర్ హీరో చిత్రం సరికొత్త త్రీడీ వర్షన్‌లో జూన్ 25, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. "బిగ్ స్క్రీన్‌పై ఈ ఎపిక్‌ను సరికొత్తగా చూసేందుకు సిద్ధంగా ఉండండి" అంటూ మేకర్స్ విడుదల చేసిన సరికొత్త అప్‌డేట్ సోషల్ మీడియాలో భారీ సంచలనం సృష్టిస్తోంది. థియేటర్లలో మొదటిసారి విడుదలైనప్పుడు సాధారణ స్క్రీన్‌లపైనే గ్రాఫిక్స్ పరంగా అద్భుతాలు సృష్టించిన ఈ సినిమా, ఇప్పుడు త్రీడీ టెక్నాలజీతో రానుండటంతో అంజనాద్రి ప్రపంచం మరింత అందంగా, కళ్లెదుటే ఉన్నట్లుగా అనిపించనుంది. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలు, భారీ యాక్షన్ ఎపిసోడ్‌లు త్రీడీలో ప్రేక్షకులకు సరికొత్త రోమాంచిత అనుభూతిని ఇస్తాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

జాతీయ అవార్డుల ఘనత.. సీక్వెల్‌కు ఊపు

'హనుమాన్' చిత్రం కేవలం కమర్షియల్ విజయాన్ని మాత్రమే కాకుండా ఉత్తమ యా నిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, ఉత్తమ స్టంట్ కొరియోగ్రఫీ విభాగాల్లో జాతీయ అవార్డులను దక్కించుకుని విమర్శకుల ప్రశంసలు పొందింది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన మొదటి చిత్రంగా ఇది భారతీయ సినిమా రంగంలో ఒక ప్రత్యేక ముద్ర వేసింది. ఈ త్రీడీ రీ-రిలీజ్ ద్వారా వచ్చే స్పందన, త్వరలోనే రాబోతున్న దీని సీక్వెల్ 'జై హనుమాన్' చిత్రానికి మరింత హైప్ తీసుకురావడానికి ఎంతో దోహదపడనుంది.

ప్రతిభావంతులైన తారాగణం.. నిర్మాణ విలువలు

ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత కే. నిరంజన్ రెడ్డి ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మించారు. ఈ చిత్రంలో తేజ సజ్జా సూపర్ హీరో పాత్రలో ఒదిగిపోగా.. అమృతా అయ్యర్ కథానాయికగా నటించారు. వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. గౌరహరి, అనుదీప్ దేవ్ అందించిన భక్తిరస స్వరాలు , నేపథ్య సంగీతం ఈ సినిమాకు ప్రాణంగా నిలిచాయి. ఓటీటీ వేదికలలో సైతం భారీ వీక్షణలు సొంతం చేసుకున్న ఈ చిత్రం, ఇప్పుడు త్రీడీ రూపంలో థియేటర్లలో మళ్లీ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Srinivas Rao

Srinivas Rao

శ్రీనివాస్ రావు జర్నలిజం రంగంలో దశాబ్దానికి పైగా అనుభవం కలిగిన కంటెంట్ రైటర్, సబ్ ఎడిటర్. రాజకీయాలు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ, లైఫ్ స్టైల్, క్రైమ్ వంటి విభిన్న అంశాల్లో లోతైన అవగాహనతో స్పష్టమైన, పాఠకులకు సులభంగా అర్థమయ్యే శైలిలో వార్తలను అందిస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థలు అయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏపీ7 ఏఎంలో పనిచేసి విలువైన అనుభవాన్ని సంపాదించారు. విశ్లేషణాత్మక దృక్పథంతో వార్తలకు కొత్త కోణాన్ని జోడిస్తూ పాఠకుల విశ్వాసాన్ని పొందుతున్నారు.

Next Story