Tollywood: సినిమాలకు డివోషనల్ టచ్.. బాక్సాఫీస్ దగ్గర కుమ్మేస్తున్న కలెక్షన్లు.!
Tollywood: భారతీయ సినీ పరిశ్రమలో డివోషనల్ చిత్రాలకు క్రేజ్ పెరుగుతూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తోంది.
Tollywood: సినిమాలకు డివోషనల్ టచ్.. బాక్సాఫీస్ దగ్గర కుమ్మేస్తున్న కలెక్షన్లు.!
Tollywood: భారతీయ సినీ పరిశ్రమలో ప్రస్తుతం ఒక సరికొత్త ట్రెండ్ నడుస్తోంది. రెగ్యులర్ కమర్షియల్ యాక్షన్ డ్రామాలకు భిన్నంగా డివోషనల్ టచ్ ఉన్న కథలకు దేశవ్యాప్తంగా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం, పురాణ గాథలను ఆధునిక సాంకేతికతతో మేళవించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అఖండ విజయాలను అందుకుంటున్నాయి.
సినిమా టైటిళ్లతో పాటు కథలోనూ ఆధ్యాత్మిక, భక్తి అంశాలను సమపాళ్లలో జోడించి భావోద్వేగాలతో ఆకట్టుకుంటే చాలు ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తి కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా విడుదలైన మాస్ మహారాజా రవితేజ 'ఇరుముడి', బాలీవుడ్ చిత్రం 'హనుమాన్ అంశ్' సాధించిన అద్భుతమైన కలెక్షన్లే ఇందుకు స్పష్టమైన నిదర్శనంగా నిలుస్తున్నాయి. సాధారణ కుటుంబ కథలకు భక్తి నేపథ్యం జోడించినప్పుడు ఆడియన్స్ నుంచి వచ్చే ఆదరణ అద్భుతంగా ఉంటోంది.
గత కొన్నేళ్లుగా వస్తున్న సినిమాల ట్రెండ్ను పరిశీలిస్తే ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. యువ కథానాయకుడు నిఖిల్ సిద్ధార్థ్ నటించిన 'కార్తికేయ 2' చిత్రం శ్రీకృష్ణుడి ద్వారకా నగరం రహస్యాల నేపథ్యంలో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. చిన్న చిత్రంగా విడుదలై నార్త్ బెల్ట్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 120 కోట్లు పైగా వసూళ్లు సాధించింది.
అదే క్రమంలో టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'హనుమాన్' చిత్రం సంక్రాంతి బరిలో బడా సినిమాలతో పోటీపడి ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 300 కోట్లుకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి సరికొత్త రికార్డులను తిరగరాసింది. యానిమేషన్ విభాగంలో రూపొందిన 'మహావతార్ నరసింహా' చిత్రం కూడా ప్రేక్షకుల ఆదరణ పొంది అద్భుతమైన బ్లాక్బస్టర్గా నిలిచింది. ఇటీవల విడుదలైన రవితేజ 'ఇరుముడి' సైతం అయ్యప్ప స్వామి భక్తి, భావోద్వేగాల కలయికతో రూపొంది ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్లు మార్కును దాటి నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది.
ఈ సూపర్ హిట్ చిత్రాల విజయాల స్ఫూర్తితో దేశవ్యాప్తంగా అగ్ర దర్శకులు, నిర్మాతలు ఆధ్యాత్మిక నేపథ్యం ఉన్న భారీ ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నారు. కేవలం తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లోనూ ఈ డివోషనల్ వేవ్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు నితేశ్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా నటిస్తున్న 'రామాయణ' చిత్రం సుమారు రూ. 800 కోట్లు భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోంది.
ఈ సినిమాలో కన్నడ స్టార్ యశ్ రావణాసురుడి పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. పవిత్ర కాశీ పుణ్యక్షేత్రం నేపథ్యంలో ఆధ్యాత్మిక కథాంశంతో తెరకెక్కుతున్న 'వారణాసి' వంటి భారీ బడ్జెట్ చిత్రాలు కూడా ఇదే తరహాలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. వీటితో పాటు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతున్న 'జై హనుమాన్' చిత్రం కూడా పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాల నడుమ రూపుదిద్దుకుంటోంది.
ఇటువంటి ప్రతిష్టాత్మక చిత్రాల నిర్మాణం కోసం నిర్మాతలు సైతం ఎక్కడా రాజీ పడకుండా రూ. 100 కోట్లు నుంచి రూ. 500 కోట్లు వరకు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఏమాత్రం వెనుకాడటం లేదు. భక్తి అనేది భారతదేశంలో ప్రజల భావోద్వేగాలతో అత్యంత బలంగా ముడిపడి ఉన్న అంశం. దర్శకులు ఈ భక్తి భావాన్ని కథలో నాణ్యమైన గ్రాఫిక్స్, అద్భుతమైన సంగీతంతో జోడించి సరైన రీతిలో ప్రజెంట్ చేస్తే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురవడం ఖాయమని సినీ ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. రాబోయే కాలంలో ఈ డివోషనల్ జానర్ మరింత ఊపందుకుని భారతీయ సినిమా స్థాయిని గ్లోబల్ మార్కెట్లో సరికొత్త శిఖరాలకు చేర్చేలా కనిపిస్తోంది.




