Narsapur: నర్సాపూర్ లో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు!

Narsapur: మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు.. నేల ఆరోగ్యం, తక్కువ పెట్టుబడితో సాగుపై జిల్లా వ్యవసాయ అధికారి సూచనలు.

G Ashok Reddy, Narsapur
Published on: 16 Sept 2026 10:17 AM IST
Narsapur
X

Narsapur: నర్సాపూర్ లో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు!

Narsapur: ప్రకృతి వ్యవసాయ పద్ధతులను రైతులు విస్తృతంగా అవలంబించాలని జిల్లా వ్యవసాయ అధికారి దేవ్‌కుమార్ సూచించారు. నర్సాపూర్ మండలంలోని చిన్న చింతకుంట, జక్కపల్లి గ్రామాల రైతులకు లింగాపూర్ రైతు వేదికలో ప్రకృతి వ్యవసాయంపై ఒకరోజు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

జిల్లా వ్యవసాయ అధికారి దేవ్‌కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రైతులకు ప్రకృతి వ్యవసాయ విధానాలు, వివిధ ప్రకృతి వ్యవసాయ కిట్ల వినియోగం, నేల ఆరోగ్య పరిరక్షణ, తక్కువ పెట్టుబడులతో పంటల సాగు వంటి అంశాలపై శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించారు.

ప్రకృతి వ్యవసాయంలో ఉపయోగించే వివిధ కిట్లను రైతులకు పంపిణీ చేసి, వాటి వినియోగ విధానాన్ని వివరించారు. రసాయనాల వినియోగాన్ని తగ్గిస్తూ అందుబాటులో ఉన్న ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పొలాల్లో ఆచరించడం ద్వారా నేల సారాన్ని కాపాడుకోవడంతో పాటు సాగు ఖర్చులను తగ్గించుకునే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి దేవ్‌కుమార్ మాట్లాడుతూ.. రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను తమ పొలాల్లో ఆచరించాలని సూచించారు. నేల ఆరోగ్యాన్ని పరిరక్షించడంతో పాటు రైతుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ప్రకృతి వ్యవసాయం కీలకమని పేర్కొన్నారు.

కార్యక్రమంలో TRVK ప్రధాన శాస్త్రవేత్త డా. సతీష్, వ్యవసాయ సహాయ సంచాలకులు సంధ్యారాణి, మండల వ్యవసాయ అధికారిణి దీపిక, వ్యవసాయ విస్తరణ అధికారులు (AEOs), CRPs, చిన్న చింతకుంట, జక్కపల్లి గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.

G Ashok Reddy, Narsapur

G Ashok Reddy, Narsapur