Narsapur: ఉధృత వర్షాలు.. రంగంలోకి దిగిన మున్సిపల్ కమిషనర్ సాయికుమార్!
Narsapur: భారీ వర్షాల నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ చెరుకు సాయికుమార్ అంబేద్కర్ చౌరస్తా వద్ద వరద నీటిని తొలగించి, పాత ఇళ్ల యజమానులను అప్రమత్తం చేశారు.
Narsapur: ఉధృత వర్షాలు.. రంగంలోకి దిగిన మున్సిపల్ కమిషనర్ సాయికుమార్!
మెదక్ జిల్లా, నర్సాపూర్, జూలై 30: నర్సాపూర్ పట్టణంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మున్సిపల్ యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ కమిషనర్ చెరుకు సాయికుమార్ స్వయంగా పట్టణంలోని పలు ప్రాంతాలను పరిశీలిస్తూ సహాయక చర్యలను వేగవంతం చేశారు.
మొదట అంబేద్కర్ చౌరస్తా వద్ద భారీగా నిలిచిపోయిన వరద నీటిని మాన్సూన్ సిబ్బంది సహాయంతో తొలగింపజేశారు. అనంతరం పట్టణంలోని వివిధ వార్డులను పర్యటించి శిథిలావస్థకు చేరుకున్న పాత ఇళ్లను పరిశీలించారు. ప్రమాదకరంగా ఉన్న ఇళ్ల యజమానులు వెంటనే మరమ్మతులు చేపట్టాలని లేదా అవసరమైతే కూల్చివేయాలని సూచించారు.
భారీ వర్షాల నేపథ్యంలో ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్న కుటుంబాలు మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన రిహాబిలిటేషన్ కేంద్రాలకు వెళ్లి సురక్షితంగా ఉండాలని కమిషనర్ సూచించారు. అలాగే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ స్తంభాలు, మంచినీటి కుంటలు, వరద నీరు నిలిచిన ప్రాంతాలు, శిథిలావస్థలో ఉన్న గోడలు, పాత భవనాల పరిసరాల్లో ఎవరూ సంచరించవద్దని హెచ్చరించారు.
అత్యవసర పరిస్థితుల్లో వెంటనే మున్సిపల్ కార్యాలయాన్ని సంప్రదించాలని పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వార్డు అధికారులు రాములు, శానిటరీ ఇన్చార్జ్ సల్లా మురళీమోహన్, వర్క్ ఇన్స్పెక్టర్లు భూపాల్, వినీత్, జవాన్లు, మాన్సూన్ సిబ్బంది మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.




