Bellampalli: పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలి: రామగుండం సీపీ!
Bellampalli: రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా మంచిర్యాల జోన్లోని బెల్లంపల్లి ఏసీపీ కార్యాలయాన్ని వార్షిక తనిఖీ చేశారు.
Bellampalli: పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలి: రామగుండం సీపీ!
బెల్లంపల్లి: వార్షిక తనిఖీల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా మంచిర్యాల జోన్లోని బెల్లంపల్లి సబ్-డివిజనల్ (ఏసీపీ) కార్యాలయాన్ని గురువారం తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఏసీపీ కిరణ్ కుమార్ పోలీస్ కమిషనర్కు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలకగా, సాయుధ పోలీసులు గౌరవ వందనం సమర్పించారు.
అనంతరం పోలీస్ కమిషనర్ కార్యాలయ ఆవరణను పరిశీలించి, ఏసీపీ కార్యాలయానికి సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. డివిజన్ పరిధిలో దర్యాప్తులో ఉన్న కేసులు,వాటి పురోగతి, నిందితుల అరెస్టులు, ఎస్సీ/ఎస్టీ (అత్యాచార నిరోధక) చట్టం కింద నమోదైన కేసుల స్థితిగతులు, పెండింగ్ కేసులపై సమీక్ష నిర్వహించి, ఆలస్యానికి గల కారణాలను ఏసీపీని అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసులను నాణ్యతతో కూడిన దర్యాప్తు నిర్వహించి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ,ప్రజల్లో పోలీసుల ఉనికి స్పష్టంగా కనిపించేలా విజిబుల్ పోలీసింగ్పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యాన్నీ సహించబోమని, నేరాల నియంత్రణకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. రౌడీషీటర్లు, హిస్టరీషీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచి వారి కదలికలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
సివిల్ భూ వివాదాల్లో పోలీసులు అనవసర జోక్యం చేసుకోకుండా చట్టపరమైన విధానాల ప్రకారమే వ్యవహరించాలని, రౌడీయిజం, దౌర్జన్యాలకు పాల్పడే వారిపై చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఎలాంటి రాజీ లేకుండా సమర్థవంతంగా విధులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
పోలీసు అధికారులు, సిబ్బంది సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని,వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే చర్యలు చేపట్టాలని సూచించారు. సిబ్బందికి క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, వారి ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని తెలిపారు.
అనంతరం పోలీస్ కమిషనర్ పోలీసు అధికారులతో కలిసి కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్తో పాటు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.




