Kagaznagar: కాగజ్నగర్లో అటవీ శాఖ వినూత్న ప్రయోగం మొక్కలు నాటిన అధికారులు
Kagaznagar: కాగజ్నగర్ రేంజ్లో అంతర్జాతీయ పులుల దినోత్సవం. క్రూర మృగాల దాడిలో పశువులను కోల్పోయిన బాధిత ఇళ్ల వద్ద మామిడి మొక్కలు నాటిన అటవీ అధికారులు.
Kagaznagar: కాగజ్నగర్లో అటవీ శాఖ వినూత్న ప్రయోగం మొక్కలు నాటిన అధికారులు
కాగజ్నగర్: అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ రేంజ్లో అటవీశాఖ ప్రజల మనసులను హత్తుకునే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. గత రెండేళ్ల కాలంలో పులులు, చిరుతపులుల దాడిలో మరణించిన పశువుల జ్ఞాపకార్థం ఆయా పశువుల యజమానుల ఇండ్ల ఎదుట వారి కుటుంబ సభ్యులతో కలిసి అటవీ అధికారులు మామిడి మొక్కలను నాటారు. చనిపోయిన పశువుల జ్ఞాపకాలను శాశ్వతంగా నిలిపే ప్రయత్నం చేశారు.
పులుల దాడిలో పశువులు మృతి చెందినప్పుడు ప్రభుత్వం తరఫున అటవీశాఖ నష్టపరిహారం అందించినప్పటికీ, బాధిత కుటుంబాల మనస్సుల్లో పులులు, అడవుల పట్ల ఎలాంటి ద్వేషభావం కలగకుండా తమ అండ ఎప్పుడూ ఉంటుందని తెలియజేసేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నాటిన మామిడి మొక్కలు ఎదిగి నీడ, పూలు, పండ్లు అందించినట్లే ప్రజల మనసుల్లో కూడా పులుల సంరక్షణ పట్ల ప్రేమాభిమానాలు పెంపొందాలని అటవీశాఖ అధికారులు ఆకాంక్ష వ్యక్తం చేశారు.
అంతేకాకుండా పులులు, ఎలుగుబంట్లు, అడవిపందుల దాడిలో గాయపడి ప్రాణాలతో బయటపడిన బాధితులతో కూడా ఈ సందర్భంగా మొక్కలు నాటించారు. పశువులను కోల్పోయిన 48 కుటుంబాలు, అటవీ జంతువుల దాడిలో గాయపడిన బాధిత కుటుంబాలు, అటవీశాఖ అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కల్పించారు.
ప్రకృతిని కాపాడుతూ, వన్యప్రాణులతో సహజీవనం సాధ్యమనే సందేశాన్ని సమాజానికి చేరవేసిన ఈ కార్యక్రమం స్థానిక ప్రజల ప్రశంసలు అందుకున్నారు..




