Gadwal: ఉపాధ్యాయుల పనితీరు మెరుగుపడకుంటే చర్యలు
Gadwal: పాఠశాలల్లో ఉపాధ్యాయుల పనితీరు మెరుగుపడకుంటే తగు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ హెచ్చరించారు.
Gadwal: ఉపాధ్యాయుల పనితీరు మెరుగుపడకుంటే చర్యలు
గద్వాల్: విద్యాశాఖ అధికారులు తమ పరిధిలోని పాఠశాలలను తరచు సందర్శిస్తూ అక్కడి కార్యకలాపాలు సజావుగా జరిగేలా పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.జిల్లాలో విద్యాశాఖ పనితీరుపై గురువారం కలెక్టర్ తన చాంబర్ నుంచి అన్ని మండలాల ఎంఈఓ లు, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు, తదితరులతో వెబ్ ఎక్స్ మీట్ ద్వారా సమీక్షించారు.
పదేపదే సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఆశించిన స్థాయిలో ఫలితాలు కనిపించడం లేదన్నారు. ఎఫ్ఎల్ఎన్, ఏఎక్స్ఎల్ ఆన్బోర్డింగ్, విద్యార్థుల నమోదు, డ్రాప్బాక్స్ పెండింగ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
జిల్లాలోని 87 ఎఫ్ఎల్ఎన్ కాంపొనెంట్ పాఠశాలల్లో విద్యార్థుల వారీగా అభ్యసన ఫలితాలను నమోదు చేసి పర్యవేక్షించాలని ఆదేశించారు. ఇటీవల నిర్వహించిన బేస్లైన్ అసెస్మెంట్ ఫలితాలను సబ్జెక్టు వారీగా ఉపాధ్యాయ సమావేశాల్లో చర్చించి, వెనుకబడిన విద్యార్థులను గుర్తించాలని సూచించారు.
ప్రతి విద్యార్థి ఏ సబ్జెక్టులో, ఏ సామర్థ్యంలో వెనుకబడి ఉన్నాడో గుర్తించి, మూడు నెలల కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. అవసరమైన వారికి రెమిడియల్, అదనపు తరగతులు నిర్వహించి నిర్దేశిత లక్ష్యాలను సాధించాలన్నారు.




