Atmakur: ఆత్మకూరు అడవుల్లో కార్చిచ్చు.. వన్యప్రాణులు విలవిల!
Atmakur: నల్లమల అటవీ ప్రాంతంలో కార్చిచ్చుల కలకలం రేగుతోంది. ఆత్మకూరు డివిజన్ కొత్తపల్లి బీట్లో మంటలు వ్యాపించాయి.
Atmakur: ఆత్మకూరు అడవుల్లో కార్చిచ్చు.. వన్యప్రాణులు విలవిల!
Atmakur: జీవ వైవిధ్యానికి, అరుదైన వన్యప్రాణులకు సహజ ఆవాస పునరుత్పత్తికి దేశంలోనే కీలక అడవులు తూర్పు కనుమల్లోని నల్లమల అటవీ ప్రాంతాలు. ప్రత్యేకించి భారతదేశంలోనే అతిపెద్ద పెద్ద పులుల సంరక్షణ అభయారణ్యం ఈ నల్లమల. వేసవి మొదలైందంటే చాలు ఎక్కడపడితే అక్కడ నల్లమల అడవుల్లో కార్చిచ్చు సహజంగా రాజుకుంటుంది. మన వైపు కొందరు కావాలని అడవులకు నిప్పు పెడుతున్నారు. ఈ క్రమంలో ఆత్మకూరు వన్యప్రాణి అడవి డివిజన్ ఆత్మకూరు అటవీ రేంజ్ కొత్తపల్లి నార్త్ బీట్లో కొండపై మంటలు చెలరేగాయి.
క్షణాల్లోనే అగ్ని కీలకలకు పెనుగాలులు తోడవడంతో అగ్నిజ్వాలలు ఎగసిపడి వ్యాపించాయి. సమీప గువ్వలకుంట్ల బేస్ క్యాంప్ సిబ్బంది రాత్రుల్లో సంఘటన స్థలానికి వెళ్లే ప్రయత్నం చేశారు. కొత్తపల్లి మండలం పరిధిలో 25 మంది ప్రొటెక్షన్ వాచర్లు, ఆరుగురు ఎఫ్ బి ఓ లు, ఇద్దరు ఎఫ్ ఎస్ ఓ లు విధులు నిర్వహిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వన్యప్రాణులకు ముప్పు వాటిల్లకుండా 24 గంటలు అడవుల్లోనే ఉంటున్నారు.
కానీ ఎప్పుడు ఏ ప్రాంతంలో అడవులు అంటుకుంటాయో తెలియని పరిస్థితుల్లో అటవీ సిబ్బంది గందరగోళానికి లోన్నవూతుంది. ఇదిలా ఉంటే నల్లమల అడవుల్లో లభించే నన్నారి వే ర్లతో షర్బత్ తయారు చేసే వ్యక్తులు అడవులకు నిప్పు పెడుతున్నారని నల్లమల సమీప గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఒకవైపు మంటలను ఆర్పే లోపు .. మరోవైపు మంటలు చెలరేగడంపై పలు అనుమానాలు అర్థమవుతున్నాయి. నాగార్జునసాగర్ - శ్రీశైలం పెద్ద పులుల సంరక్షణ అభయారణ్యం పరిధిలో మూడు అటవీ డివిజన్లో నల్లమలలో ఏదో ఒక మూలలో కార్చిచ్చు రేగి నల్లమల అడవులు తగలబడి పోతున్నాయి.
పెద్దపులితో పాటు ఇతర అరుదైన వన్యప్రాణుల ప్రాణాలకు రోజురోజుకు ముప్పు పెరిగిపోతుంది. శ్రీశైలం, మహానంది, పల్నాడు, ఆత్మకూరు అడవులను కార్చిచ్చు నుంచి రక్షించేందుకు అటవీ శాఖ ఉన్నతాధికారం నుంచి కిందిస్థాయి ఫైర్ వాచర్లు, ప్రొటెక్షన్ వాచర్లు ప్రాణాలకు తెగించి శ్రమిస్తున్నారు. విదేశాల్లో అడవుల్లో వ్యాపించిన కార్తిచ్చును ఆర్పేందుకు ఆఖ్యాధునిక యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా ఉపయోగిస్తారో ఆ తరహా పరికరాలని అందిస్తే తప్ప నల్లమలలో రోజురోజుకు విస్తరిస్తున్న కార్తిచ్చును నియంత్రించలేమని ఆ దిశగా రాష్ట్ర అటవీశాఖ చర్యలు చేపట్టాలని అటవీ శాఖ అధికారులు సిబ్బంది ప్రభుత్వాన్ని కోరుతున్నారు.




