Markapuram: డప్పు కళాకారులు, చర్మకారుల పింఛన్ల దరఖాస్తు సులభతరం!
Markapuram: డప్పు కళాకారులు, చర్మకారుల పింఛన్ల దరఖాస్తు సులభతరం. సచివాలయాల్లో స్వీయ ధృవీకరణ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని డీడీ లక్ష్మా నాయక్ వెల్లడి.
Markapuram: డప్పు కళాకారులు, చర్మకారుల పింఛన్ల దరఖాస్తు సులభతరం!
Markapuram: డప్పు కళాకారులు, చర్మకారులకు మంజూరు చేసే పింఛన్ల దరఖాస్తు ప్రక్రియను ప్రభుత్వం మరింత సులభతరం చేసింది. పింఛన్ల కోసం సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని ఆ శాఖ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ యన్. లక్ష్మా నాయక్ తెలిపారు.
అర్హులైన లబ్ధిదారులు తమకు సమీపంలోని స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు సచివాలయాల ద్వారానే దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ఎలాంటి మధ్యవర్తులను ఆశ్రయించకుండా కేవలం *స్వీయ ధృవీకరణ (Self Declaration)*తో నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ దరఖాస్తుదారుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తారని, పట్టణ ప్రాంతాల్లో వార్డు సచివాలయంలోని సంబంధిత సిబ్బంది ద్వారా ఆన్లైన్ నమోదు జరుగుతుందని వివరించారు.
ఆన్లైన్లో నమోదైన దరఖాస్తులను సంబంధిత సంక్షేమ సిబ్బంది నిబంధనల ప్రకారం పరిశీలించి, అనంతరం క్షేత్రస్థాయి ధృవీకరణ చేపడతారని తెలిపారు. అర్హత నిర్ధారణ అనంతరం తదుపరి అనుమతుల కోసం సంబంధిత ఎంపీడీఓ లేదా మున్సిపల్ కమిషనర్కు నివేదికలు పంపిస్తారని వెల్లడించారు.
పింఛన్ల దరఖాస్తు ప్రక్రియలో సందేహాలు లేదా సాంకేతిక సమస్యలు ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో స్వర్ణ గ్రామ సచివాలయ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, పట్టణ ప్రాంతాల్లో స్వర్ణ వార్డు వెల్ఫేర్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీని సంప్రదించాలని డీడీ లక్ష్మా నాయక్ సూచించారు.




