Nandyal: జాతీయ మొక్కజొన్న బోర్డును ఏర్పాటు చేయాలి ఎంపీ శబరి

Nandyal: పార్లమెంట్‌లో జాతీయ మొక్కజొన్న బోర్డు ఏర్పాటును కోరిన నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించిన వైనం.

Ramanaiah, Banaganepalle
Published on: 7 Aug 2026 4:29 PM IST
Nandyal
X

Nandyal: జాతీయ మొక్కజొన్న బోర్డును ఏర్పాటు చేయాలి ఎంపీ శబరి

నంద్యాల: జాతీయ మొక్క జొన్న బోర్డును ఏర్పాటు చేయాలని శుక్రవారం భారత పార్లమెంట్ లో నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బైరెడ్డి శబరి లోక్ సభ జీరో అవర్ లో కోరారు.

ఈ సందర్బంగా లోక్ సభలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ భారతదేశానికి మొక్కజొన్న ఒక వ్యూహాత్మక పంటగా ఆవిర్భవించిందని నేను చెప్పదలుచుకున్నాను అన్నారు. ఒకప్పుడు కేవలం ఒక ధాన్యంగా మాత్రమే పరిగణించబడిన మొక్కజొన్న పంట ఇప్పుడు ఆహారం, ఇంధనం, పశుగ్రాసానికి కేంద్రంగా మారిందని, వరి, గోధుమల తర్వాత మూడవ అతిపెద్ద ధాన్యంగా మొక్కజొన్న ఆహార భద్రతకు, కోళ్లు, పశుసంపద రంగానికి, భారతదేశపు ఇథనాల్ మిశ్రణ కార్యక్రమానికి తోడ్పడుతుందన్నారు. అంతేకాకుండా, దీనికి తక్కువ నీరు అవసరమవుతుందని, వాతావరణ మార్పులను తట్టుకునే గొప్ప సామర్థ్యం మొక్క జొన్నకు ఉందన్నారు.

మొక్కజొన్న సాగు రాయలసీమ, ఆంధ్రప్రదేశ్‌లకు ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తుందనీ. గత మూడు దశాబ్దాలుగా, రాష్ట్రంలో మొక్కజొన్న సాగు గణనీయంగా విస్తరించిందని, ఉత్పత్తి, ఉత్పాదకతలో చెప్పుకోదగ్గ వృద్ధి నమోదైందన్నారు. అయినప్పటికీ, వరి, గోధుమలకు లభించే సంస్థాగత మద్దతు మొక్కజొన్న పంటకు ఇప్పటికీ లేదనీ. రైతులు హామీతో కూడిన కొనుగోలు కేంద్రాల కొరత, ధరల అస్థిరత, ప్రైవేట్ వ్యాపారులపై ఆధారపడటం, ఆహారం, పశుగ్రాసం, ఇథనాల్ డిమాండ్‌ను సమతుల్యం చేసే యంత్రాంగం లేకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పార్లమెంట్ దృష్టికి తెచ్చారు.

నంద్యాల జిల్లాతో పాటు రాయలసీమ అంతటా, తగినంత కొనుగోలు మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల మొక్కజొన్న సాగు రైతులు తరచుగా లాభదాయకం కాని ధరలకు అమ్ముకోవలసి వస్తోందనీ, అందువల్ల, కనీస మద్దతు ధర (MSP) ఆధారంగా కొనుగోలును నిర్ధారించడానికి, ప్రధాన ఉత్పత్తి ప్రాంతాలలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడానికి, ధరలను స్థిరీకరించడానికి, వివిధ రంగాలలో మొక్కజొన్న వినియోగాన్ని సమన్వయం చేయడానికి, మెట్ట భూములకు ప్రత్యేకమైన రకాలను ప్రోత్సహించడానికి, ఇతర ప్రధాన పంటలకు అందుబాటులో ఉన్నటువంటి సంస్థాగత మద్దతును మొక్కజొన్న రైతులకు అందించడానికి ఒక జాతీయ మొక్కజొన్న బోర్డును ఏర్పాటు చేయాలని భారత ప్రభుత్వాన్ని నేను కోరుతున్నానని నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు.

Ramanaiah, Banaganepalle

Ramanaiah, Banaganepalle

Next Story