Kurnool: భక్తుల కోరిక మేరకు కేసీ కెనాల్లోనే వినాయక నిమజ్జనం మంత్రి టీజీ భరత్!
Kurnool: కర్నూలు కేసీ కెనాల్లోనే వినాయక నిమజ్జనం. భక్తుల సెంటిమెంట్కు అనుగుణంగా 600 మీటర్ల ట్యాంక్ తరహా ఏర్పాట్లు చేస్తామని మంత్రి టీజీ భరత్ ప్రకటన.
Kurnool: భక్తుల కోరిక మేరకు కేసీ కెనాల్లోనే వినాయక నిమజ్జనం మంత్రి టీజీ భరత్!
Kurnool: వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని భక్తుల మనోభావాలు, కమిటీ సభ్యుల విజ్ఞప్తులకు అనుగుణంగా కేసీ కెనాల్లోనే నిమజ్జనం నిర్వహించాలనే తుది నిర్ణయం తీసుకున్నట్లు రాష్ర్ట పరిశ్రమలు, వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రివర్యులు టీజీ భరత్ గుప్తా తెలిపారు.
సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో వినాయక చవితి నిమజ్జన ఏర్పాట్ల పై గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో, సంబంధిత శాఖల అధికారులతో రాష్ర్ట పరిశ్రమలు, వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రివర్యులు సమావేశం నిర్వహించారు.
మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ తరువాత, ఆంధ్రప్రదేశ్లో అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో మరియు ప్రత్యేకమైన సెంటిమెంట్తో గణేష్ నిమజ్జన వేడుకలు జరిగే నగరాల్లో కర్నూలుకు ప్రత్యేక స్థానం ఉందని మంత్రి పేర్కొన్నారు. 40 ఏళ్లకు పైగా కొనసాగుతున్న సంప్రదాయాన్ని కొనసాగిస్తూ కమిటీ సభ్యుల విజ్ఞప్తుల మేరకు ఈసారి కూడా కేసీ కెనాల్లోనే గణేష్ నిమజ్జనం నిర్వహించేందుకు నిర్ణయించడం జరిగిందన్నారు.
ప్రస్తుతం సుంకేసుల బ్యారేజ్లో నీటి లభ్యత లేకపోవడం, గత రెండు దశాబ్దాల రికార్డులతో పోలిస్తే అత్యల్ప నీటి మట్టం ఉండటం వల్ల అక్కడి నుంచి కేసీ కెనాల్కు నీరు వచ్చే అవకాశం లేని పరిస్థితి నెలకొందన్నారు. ఉన్న కొద్దిపాటి నీటిని త్రాగునీటి అవసరాల కోసం నిలువ చేయడం జరిగిందని తెలిపారు. ఈ నేపథ్యంలో కేసీ కెనాల్లోని అప్స్ట్రీమ్, డౌన్స్ట్రీమ్ ప్రాంతాల్లో అవసరమైన గోడలను నిర్మించి, సుమారు 600 మీటర్ల మేర ప్రాంతాన్ని ట్యాంక్ తరహాలో నీటి నిల్వ చేయడానికి సిద్ధం చేస్తున్నారన్నారు. ప్రస్తుతం కర్నూలు నీటి సరఫరా కేంద్రం నుండి రోజువారీగా లభించే వాటర్ ట్రీట్మెంట్ తర్వాత వచ్చే నీరు, బ్యాక్వాటర్ తదితర మార్గాల ద్వారా సుమారు 20 లక్షల లీటర్ల నీరు అందుబాటులోకి వస్తున్నట్లు మంత్రి తెలిపారు.
నిమజ్జన సమయానికి అక్కడ 6 నుంచి 9 అడుగుల మేర నీటి మట్టం ఉండే అవకాశం ఉంటుందని తెలిపారు. దీనివల్ల భక్తులు, వినాయక విగ్రహాల ను నిమజ్జనం చేసుకునే అవకాశం కల్పించనున్నారన్నారు. అదే విధంగా 600 మీటర్ల పరిధికి అనుగుణంగా అవసరమైన క్రేన్లు, భద్రతా చర్యలు, ఇతర మౌలిక ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నామని మంత్రి తెలిపారు హంద్రీనీవా సుజల స్రవంతి కాలువలో నన్నూరు టోల్గేట్ , తడకనపల్లి మరియు ఉలిందకొండ పరిసరాలలో నిమజ్జనం నిర్వహించే అంశాన్ని పరిశీలించినప్పటికీ, భక్తులు, వినాయక చవితి కమిటీ సభ్యుల భావోద్వేగాలు, విజ్ఞప్తులను గౌరవిస్తూ కేసీ కెనాల్లోనే నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించడం జరిగిందన్నారు.. ఈసారి గతంలో కంటే మరింత వైభవంగా, భక్తిశ్రద్ధలతో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా సురక్షితంగా వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోందన్నారు.
పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత మాట్లాడుతూ... కర్నూలు నగరంలో గత 4 దశాబ్దాలుగా వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో, ఈ ఏడాది నిర్వహించనున్న నిమజ్జన కార్యక్రమాన్ని భక్తుల సెంటిమెంట్కు అనుగుణంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం నీటి లభ్యత తక్కువగా ఉన్న పరిస్థితుల్లో కీసీ కెనాల్లో నీటిని నిల్వ చేసి, అవసరమైన చోట అడ్డుగోడ ఏర్పాటు చేసి నిమజ్జనానికి అనుకూలంగా తీర్చిదిద్దేలా చర్యలు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు కోరిన ప్రాంతంలోనే నిమజ్జన ఏర్పాట్లు చేసేలా అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగనున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. కేసి కెనాల్ వద్ద నిమజ్జనం కోసం ఘాట్ ఏర్పాటు చేయడంతో పాటు, అక్కడ భద్రతా పరంగా మెరుగైన ఏర్పాట్లు అందుబాటులో ఉన్నాయని ఎమ్మెల్యే తెలిపారు.
నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించేందుకు రెవెన్యూ, మున్సిపల్ కార్పొరేషన్, పోలీస్ శాఖల సిబ్బంది గణేష్ ఉత్సవ కమిటీతో సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే కోరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమిష్టిగా పనిచేసి నిమజ్జన కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలన్నారు.
జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ. నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు పోలీసు బందోబస్తు పరంగా తీసుకోవాల్సిన అని జాగ్రత్తలను తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.
సమావేశంలో కర్నూల్ మున్సిపల్ కమిషనర్ ఓబులేసు , ఆర్ అండ్ బి ఎస్ఈ మహేశ్వర రెడ్డి , ఆర్టీసీ ఆర్ఎం శ్రీనివాసులు , డిస్టిక్ ఫైర్ ఆఫీసర్ అవినాష్ జయసింహ , వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.




