Kurnool: నగరపాలక సంస్థ షాపుల వేలంపాట ద్వారా రూ.6.70 కోట్ల ఆదాయం

Kurnool: కర్నూలు నగరంలోని మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌లలోని 81 షాపుల వేలంపాట ద్వారా నగరపాలక సంస్థకు రూ.6.70 కోట్ల ఆదాయం సమకూరినట్లు అదనపు కమిషనర్ తెలిపారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 27 Aug 2026 9:01 PM IST
Kurnool
X

Kurnool: నగరపాలక సంస్థ షాపుల వేలంపాట ద్వారా రూ.6.70 కోట్ల ఆదాయం

కర్నూలు: నగరంలోని 8 మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌లలో 81 షాపుల వేలంపాట ద్వారా నగరపాలక సంస్థకు రూ.6.70 కోట్ల ఆదాయం సమకూరినట్లు అదనపు కమిషనర్ ఆర్‌జి‌వి కృష్ణ తెలిపారు. గురువారం స్థానిక ఎస్బీఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో మూడోరోజు వేలంపాట నిర్వహించారు.

ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ.. నగరపాలక సంస్థకు చెందిన షాపింగ్ కాంప్లెక్స్‌లలోని దుకాణాలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా మూడు రోజులు వేలం నిర్వహించామని తెలిపారు. ఈ నెల 22, 25, 27 తేదీల్లో నిర్వహించిన వేలంపాటల్లో ఇప్పటివరకు మొత్తం 81 దుకాణాలు వేలం వేయగా, గుడ్‌విల్, సెక్యూరిటీ డిపాజిట్ తదితరాల రూపంలో మొత్తం రూ.6.70 కోట్ల ఆదాయం సమకూరిందన్నారు.

మూడోరోజు నిర్వహించిన వేలంపాటలో సి.క్యాంప్ సెంటర్‌లోని 36 దుకాణాలకు వేలంపాట నిర్వహించగా, వాటి ద్వారా రూ.5.16 కోట్లకుపైగా ఆదాయం సమకూరినట్లు తెలిపారు. గత మూడు రోజులుగా జరిగిన వేలంపాటల్లో వ్యాపారులు, ఔత్సాహికులు పోటీతత్వంతో పాల్గొనడం ద్వారా నగరపాలక సంస్థకు గణనీయమైన ఆదాయం లభించిందన్నారు.

వేలంపాటలో తగినంత పోటీ లేని దుకాణాలకు సంబంధించి వేలాన్ని వాయిదా వేసినట్లు అదనపు కమిషనర్ తెలిపారు. భవిష్యత్‌లోనూ నిబంధనల మేరకు వేలంపాటలను పారదర్శకంగా నిర్వహించి, నగరపాలక సంస్థ ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటామని అదనపు కమిషనర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, ఆర్వోలు వాజిద్, క్రిస్టోఫర్, మంజూర్ బాష, తదితరులు పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story