Kurnool: కర్నూలులో మున్సిపల్ స్థలాల ఆక్రమణలపై కమిషనర్ సీరియస్
Kurnool: కర్నూలులో మున్సిపల్ స్థలాలను ఆక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించిన కమిషనర్ చల్లా ఓబులేసు. హైకోర్టు ఆదేశాలతో ఆక్రమణల తొలగింపు.
Kurnool: కర్నూలులో మున్సిపల్ స్థలాల ఆక్రమణలపై కమిషనర్ సీరియస్
కర్నూలు: నగరంలోని మున్సిపల్ స్థలాలను ఆక్రమిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు స్పష్టం చేశారు. మున్సిపల్ ఆస్తులను పరిరక్షించడంతో పాటు ఆక్రమణలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదన్నారు. బుధవారం కండేరి మున్సిపల్ క్వార్టర్స్లో ఆక్రమణకు గురైన 11 సెంట్ల మున్సిపల్ స్థలాన్ని పరిశీలించిన కమిషనర్, రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఆక్రమణలను వెంటనే తొలగించాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. దీంతో 12 మంది సిబ్బందితో కూడిన ప్రత్యేక బృందం ఆక్రమణలను తొలగించింది.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. నగరంలోని మున్సిపల్ స్థలాలు, ఆస్తులను గుర్తించి వాటి పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వ, మున్సిపల్ స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినా, ఇతర అవసరాలకు వినియోగించినా నిబంధనల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆక్రమణల విషయంలో ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. మున్సిపల్ స్థలాలను ఆక్రమించినా, ఆక్రమణలకు ప్రయత్నించినా వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అంతకుముందు 19వ వార్డు రాంప్రియ నగర్లో ఆక్రమణలు, రహదారికి సంబంధించిన పీజీఆర్ఎస్ ఫిర్యాదును పరిశీలించారు. ప్రధాన రహదారుల్లో పలుచోట్ల నిలువ ఉన్న వర్షపునీరు తొలగింపజేశారు. ఏపీఎచ్బీ కాలనీలో విద్యుత్ దీపాల సమస్యను, కలెక్టరేట్లోని అన్న క్యాంటీన్ను కమిషనర్ పరిశీలించారు.
కార్యక్రమంలో ఏసీపీ నాగరాజు, పట్టణ ప్రణాళిక అధికారి అంజాద్ బాష, బిల్డింగ్ ఇన్స్పెక్టర్ దివాకర్, శానిటరీ ఇన్స్పెక్టర్ లోకేష్ తదితరులు పాల్గొన్నారు.




