Kurnool: కేంద్రీయ విద్యాలయంలో మౌలిక వసతులు వేగవంతం కలెక్టర్!

Kurnool: కేంద్రీయ విద్యాలయంలో మెరుగైన వసతులు కల్పించాలని కలెక్టర్ డా. ఏ.సిరి ఆదేశించారు. సెప్టెంబర్ ఆఖరులోగా ర్యాంప్, టాయిలెట్లు, డ్రైనేజీ పనులు పూర్తి చేయాలన్నారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 4 Sept 2026 2:05 PM IST
Kurnool
X

Kurnool: కేంద్రీయ విద్యాలయంలో మౌలిక వసతులు వేగవంతం కలెక్టర్!

Kurnool: కర్నూలు కేంద్రీయ విద్యాలయలో విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడంతో పాటు విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతుల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి కేంద్రీయ విద్యాలయ అధికారులను ఆదేశించారు.

గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో విద్యాలయ మేనేజ్‌మెంట్ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు.

కలెక్టర్ మాట్లాడుతూ కేంద్రీయ విద్యాలయలో మౌలిక వసతుల మెరుగుదల కోసం నిర్వహణ, మరమ్మతుల కింద మంజూరైన పనులను సెప్టెంబర్ నెలాఖరులోగా పూర్తి చేయాలన్నారు. ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులు సులభంగా రాకపోకలు సాగించేందుకు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మొదటి అంతస్తు వరకు ర్యాంప్ నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అదే విధంగా డ్రైనేజీ వ్యవస్థ, ర్యాంప్, టాయిలెట్ల నిర్మాణం అత్యంత కీలకమైన పనులని, వీటికి హెడ్‌క్వార్టర్స్ నుంచి త్వరితగతిన అనుమతులు పొందేందుకు అవసరమైన ప్రతిపాదనలు, సిఫార్సులను సమర్పించి ఫాలోఅప్ చేయాలని కలెక్టర్ కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ ను ఆదేశించారు..

పాఠశాల ఆవరణలో సుమారు 2 నుంచి 3 ఎకరాల ఖాళీ స్థలం ఉందని, మైదానం పరిసరాలను శుభ్రం చేసినప్పటికీ ప్రస్తుతం పెద్ద రాళ్లు ఉండటం వల్ల విద్యార్థులు ఆడుకోలేకపోతున్నారని కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ కలెక్టర్ దృష్టికి తీసుకొని రాగా, మైదానం అభివృద్ధికి మున్సిపల్ కమిషనర్‌తో సమన్వయం చేసుకోవాలని కలెక్టర్ కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ ను ఆదేశించారు.. పాఠశాల హైవే సమీపంలో ఉన్నందున విద్యార్థులు పాఠశాల నుంచి బయటకు వెళ్లే సమయంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం ఇద్దరు పోలీసులను డిప్యూట్ చేయాలని కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ కలెక్టర్ దృష్టికి తీసుకొని రాగా, అందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ ప్రియదర్శిని మాట్లాడుతూ విద్యాలయ మౌలిక వసతుల మెరుగుదల కోసం నిర్వహణ, మరమ్మతుల కింద మంజూరైన పనుల్లో రూఫ్ వాటర్‌ప్రూఫింగ్ పని పూర్తికాగా, ఫ్లోర్ ట్రీట్‌మెంట్ పని 85 శాతం పూర్తయిందని, రోడ్డు పనికి కూడా మంజూరు లభించిందని కలెక్టర్ కి వివరించారు. మిగిలిన పనులకు ప్రాధాన్యత ఆధారంగా మంజూరు పొందేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు 2024-25లో పీఎం శ్రీ పథకం కింద 98 శాతానికి పైగా, 2025-26లో 93.85 శాతం నిధులు ఖర్చు చేసినట్లు తెలిపారు. క్రీడల్లో ఇద్దరు విద్యార్థులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారని, వచ్చే ఏడాది ఈ సంఖ్యను రెట్టింపు చేసే లక్ష్యంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు.. 10వ తరగతి, 12వ తరగతి పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించామన్నారు.

సమావేశంలో పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ మ్యాథ్స్ టీచర్ షేక్షావలి, సిజిఈడబ్ల్యూసిసి సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ జనార్దన్ రెడ్డి, టెక్నికల్ మెంబర్ రాజా తదితరులు పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story