Kurnool: కర్నూలు కలెక్టరేట్లో కలెక్టర్ డా.ఏ సిరి ఆకస్మిక తనిఖీలు!
Kurnool: కర్నూలు జిల్లా కలెక్టరేట్ ప్రాంగణం పరిశుభ్రంగా, సుందరంగా మరియు ప్రజలకు అనుకూలంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి అధికారులను ఆదేశించారు.
Kurnool: కర్నూలు కలెక్టరేట్లో కలెక్టర్ డా.ఏ సిరి ఆకస్మిక తనిఖీలు!
కర్నూలు: కలెక్టరేట్ ప్రాంగణం పరిశుభ్రంగా, సుందరంగా, ప్రజలకు అనుకూలంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్ కాంప్లెక్స్ ఆవరణంలో పరిశుభ్రత, పార్కింగ్ నిర్వహణ, గ్రీనరీ అభివృద్ధి, బ్యూటిఫికేషన్ , ప్రజలకు అందిస్తున్న సౌకర్యాలు, భవనాల నిర్వహణ తదితర అంశాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టరేట్ పరిసర ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలిస్తూ సంబంధిత అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. కలెక్టరేట్ ప్రభుత్వ పరిపాలనకు ప్రతిబింబంగా ఉండే ప్రధాన కేంద్రం కాబట్టి, కార్యాలయ ప్రాంగణం ఎల్లప్పుడూ పరిశుభ్రంగా, ఆకర్షణీయంగా, ప్రజలకు అనుకూలంగా ఉండేలా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ ఆవరణలో సుందరీకరణ చర్యలు చేపట్టి, అన్ని విభాగాల్లో యూనిఫామ్ విధానంలో గ్రీనరీ పెంపొందించాలని సూచించారు. మొక్కల పెంపకం, పచ్చదనం సంరక్షణ, పూల మొక్కల ఏర్పాటు వంటి.
చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రతి విభాగం పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ఎక్కడా చెత్త పేరుకుపోకుండా నిరంతరం పరిశుభ్రత చర్యలు కొనసాగించాలని ఆదేశించారు. కలెక్టరేట్ కాంప్లెక్స్లో వాహనాల పార్కింగ్ను క్రమబద్ధీకరించి, అధికారులు, సిబ్బంది, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక పార్కింగ్ వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.
అనధికార పార్కింగ్ను నియంత్రిస్తూ రాకపోకలకు ఆటంకం కలగకుండా చూడాలని చెప్పారు. అదేవిధంగా కలెక్టరేట్కు వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజల సౌకర్యార్థం అవసరమైన ప్రాంతాల్లో బెంచీలు సంఖ్య పెంచాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు వేచి ఉండే సమయంలో ఇబ్బందులు పడకుండా తగిన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ప్రజలకు అనుకూలమైన వాతావరణం కల్పించడం ప్రతి శాఖ బాధ్యతగా భావించాలని తెలిపారు.
భవనాల వద్ద ఉన్న చిన్నచిన్న మరమ్మత్తు పనులను వెంటనే పూర్తి చేయాలని, పాడైన ప్రాంతాలను సరిచేసి కార్యాలయ వాతావరణాన్ని మెరుగుపరచాలని సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ, పారిశుధ్య నిర్వహణ వంటి అంశాల్లో నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు. కలెక్టరేట్ కార్యాలయంలో ప్రతి శాఖ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, పచ్చదనాన్ని మరింత పెంపొందించి ఆహ్లాదకర వాతావరణం కల్పించాలని కలెక్టర్ సూచించారు.
ఉద్యోగస్తులు పనిచేయడానికి కూడా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాలపై మంచి అభిప్రాయం కలిగేలా ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మ, ఆర్ అండ్ బి సూపర్డెంట్ ఇంజనీర్ మహేశ్వర్ రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు, తదితరులు పాల్గొన్నారు.




