Kurnool: రూపురేఖలు మార్చేలా సుందరీకరణ నగరపాలక కమిషనర్ చల్లా ఓబులేసు!
Kurnool: కర్నూలులో 9 ప్రధాన కూడళ్ల అభివృద్ధికి రూ.30 లక్షలతో ప్రతిపాదనలు. 5 రహదారుల కూడలి పనులను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు.
Kurnool: రూపురేఖలు మార్చేలా సుందరీకరణ నగరపాలక కమిషనర్ చల్లా ఓబులేసు!
Kurnool: నగరాన్ని మరింత సుందరంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు ప్రధాన కూడళ్లు, రహదారులు, డివైడర్లు, నడకబాటల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు. శనివారం ఆయన నగరంలోని 5 రహదారుల కూడలిలో చేపట్టిన ఆధునికీకరణ పనులను పరిశీలించారు.
కమిషనర్ మాట్లాడుతూ.. నగరంలోని 9 ప్రధాన కూడళ్లను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. కూడళ్లలో టర్ఫ్ గడ్డి అమర్చడం, వాటర్ ఫౌంటెన్ల మరమ్మత్తులు చేపట్టడం కోసం సుమారు రూ.30 లక్షలతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు చెప్పారు. ప్రధాన రహదారుల వెంట ఉన్న డివైడర్లకు ఆకర్షణీయమైన రంగులు వేయడంతో పాటు, నడకబాటలకు అవసరమైన మరమ్మత్తులు చేపడుతున్నట్లు వెల్లడించారు.
అదేవిధంగా రహదారుల వెంట పచ్చదనం పెంపొందించడం, మొక్కలు నాటడం, గోడలపై ఆహ్లాదకరమైన చిత్రాలను ఏర్పాటు వేయడం వంటి పనులు చేపట్టనున్నట్లు కమిషనర్ తెలిపారు. నగరానికి వచ్చే ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా సుందరీకరణ పనులను నాణ్యతతో, వేగంగా పూర్తి చేస్తామన్నారు.
కూడళ్ల అభివృద్ధితో పాటు నగర పరిశుభ్రత, పచ్చదనాన్ని కాపాడేందుకు ప్రజలు సైతం సహకరించాలని కమిషనర్ కోరారు. కార్యక్రమంలో హార్టికల్చర్ ఏడి ప్రతాప్ రెడ్డి, డిఈఈ కృష్ణలత, తదితరులు పాల్గొన్నారు.




