Atmakur: ఆత్మకూరులో డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్‌సీపీ దీక్షలు

Atmakur: డీఎస్సీ స్పోర్ట్స్ కోటా అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని ఆత్మకూరులో మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ రెండో రోజు దీక్ష.

P NAGESWARA RAO, SRISAILAM
Published on: 7 Aug 2026 3:06 PM IST
Atmakur
X

Atmakur: ఆత్మకూరులో డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్‌సీపీ దీక్షలు

ఆత్మకూరు: నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరులో డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలకు నిరసనగా, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న రెండో రోజు రిలే నిరాహార దీక్షల్లో వైయ‌స్సార్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగుమాల శోభన్‌బాబు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలతో పాటు ఇతర ఎంపికల ప్రక్రియలోనూ తీవ్రమైన అక్రమాలు జరిగాయని ఆరోపించారు. మెరిట్ ఉన్న నిరుద్యోగ యువతను మోసం చేసిన ప్రభుత్వంపై సీబీఐ విచారణ జరిపించాలని, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులను కేసులు, బెదిరింపులతో అణచివేయడం ఎంతకాలం సాగదని హెచ్చరించారు.

ప్రజల సమస్యలను పక్కనబెట్టి ప్రశ్నించే వారినే లక్ష్యంగా చేసుకుంటున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని గంగుమాల శోభన్‌బాబు స్పష్టం చేశారు.

యువతను దగా చేసిన ప్రభుత్వం

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యువతకు ఇచ్చిన హామీలన్నింటినీ విస్మరించి, నిరుద్యోగులను పూర్తిగా మోసం చేసిందని గంగుమాల శోభన్‌బాబు విమర్శించారు.

ప్రజల సమస్యలను పరిష్కరించడం మానేసి ప్రతిరోజూ వైఎస్ జగన్‌ను లక్ష్యంగా చేసుకుని రాజకీయ విమర్శలకే పరిమితమైందన్నారు.

వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా ప్రతి సంక్షేమ పథకాన్ని అర్హుల ఇంటి వద్దకే చేర్చిన ఘనత ఆయనదేనని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నాయకుడు వైఎస్ జగన్ మాత్రమేనని అన్నారు.

డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో భారీ అక్రమాలు

డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల్లో మెరిట్‌ను పూర్తిగా పక్కనబెట్టి అక్రమాలకు పాల్పడ్డారని గంగుమాల శోభన్‌బాబు ఆరోపించారు. బంగారు, వెండి పతకాలు సాధించిన నిజమైన క్రీడాకారులకు ఉద్యోగాలు ఇవ్వకుండా అర్హత లేని వారికి నియామకాలు కల్పించారని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం 2020 నుంచే క్రీడా ప్రతిభను ఆన్‌లైన్‌లో నమోదు చేసే విధానాన్ని తీసుకొచ్చినా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడం వెనుక అక్రమాలను దాచిపెట్టే ఉద్దేశమే కనిపిస్తోందని విమర్శించారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై సీబీఐ విచారణ జరిగితే అసలు నిజాలు బయటపడతాయని చెప్పారు.

క్రీడా సంఘాలే అక్రమాలు జరిగాయని చెబుతున్నాయి

ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్.కే. పురుషోత్తం కూడా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై సందేహాలు వ్యక్తం చేస్తూ విచారణ జరపాలని కోరారని గంగుమాల శోభన్‌బాబు గుర్తుచేశారు.

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, రాష్ట్ర క్రీడా సంస్థలు, ఒలింపిక్ అసోసియేషన్ వద్ద ఉన్న రికార్డులను పరిశీలిస్తే నియామకాలలో జరిగిన అక్రమాలు బయటపడతాయని అన్నారు. అందుకే మంత్రి లోకేష్ నైతిక బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ప్రశ్నిస్తే కేసులు.. ఇదేనా ప్రజాస్వామ్యం?

ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేయడం, అర్ధరాత్రి ఇళ్లపై దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని గంగుమాల శోభన్‌బాబు మండిపడ్డారు. ప్రజల గొంతును ఎంతకాలం అణచివేస్తారని ప్రశ్నించారు.

ప్రజా సమస్యలపై పోరాడుతున్న వారిని భయపెట్టే ప్రయత్నాలు శాశ్వతంగా సాగవని, అన్యాయానికి గురవుతున్న యువత, నిరుద్యోగులు, ప్రజలంతా ఒకరోజు తిరగబడితే ఈ ప్రభుత్వం ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

యువత కోసం పోరాటం కొనసాగుతుంది

వైయ‌స్సార్‌సీపీ చేస్తున్న పోరాటం పార్టీ కోసం కాదని, యువత భవిష్యత్తు కోసం, నిరుద్యోగులకు న్యాయం చేయించడానికేనని గంగుమాల శోభన్‌బాబు స్పష్టం చేశారు. డీఎస్సీ అక్రమాలపై పూర్తి స్థాయి సీబీఐ విచారణ జరిగే వరకు, బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు వైయ‌స్సార్‌సీపీ ప్రజల తరఫున పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుందని తెలిపారు.

P NAGESWARA RAO, SRISAILAM

P NAGESWARA RAO, SRISAILAM

Next Story