Vuyyuru: గంజాయి దందాపై ఉయ్యూరు రూరల్ పోలీసుల ఉక్కుపాదం!
Vuyyuru: పెదగిరాలలో 1.340 కిలోల గంజాయితో ఐదుగురు ముఠా అరెస్ట్.. ఉయ్యూరు రూరల్ పోలీసుల మెరుపు దాడి, రెండు బైక్లు సీజ్.
Vuyyuru: గంజాయి దందాపై ఉయ్యూరు రూరల్ పోలీసుల ఉక్కుపాదం!
Vuyyuru: గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడుతున్న ముఠాపై ఉయ్యూరు రూరల్ పోలీసులు కొరడా ఝళిపించారు. పెదగిరాల గ్రామంలో గంజాయి విక్రయానికి సిద్ధంగా ఉన్న ఐదుగురిని పోలీసులు అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 1.340 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు రెండు మోటార్ సైకిళ్లు, మూడు సెల్ఫోన్లను సీజ్ చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం గంజాయి అక్రమ విక్రయాలపై అందిన సమాచారంతో నిఘా పెట్టిన పోలీసులు సెప్టెంబర్ 4న పెదగిరాల గ్రామంలో దాడి నిర్వహించారు. ఈ దాడిలో గంజాయితో పట్టుబడిన వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితులపై NDPS Act-1985 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఐదుగురు నిందితులు అరెస్ట్
పోలీసులు అరెస్టు చేసిన వారిలో పోలివెంప సుధీర్ (21), కట్టా నాగబాబు (23), దాగంటిపాటి ఆకాష్ (24), పీరి భార్గవ్ బాబు (18), తలకంటి పవన్ (19) ఉన్నారు. వీరంతా పెదగిరాల గ్రామానికి చెందినవారిగా ప్రెస్నోట్లో పేర్కొన్నారు.
గత కేసులపైనా పోలీసుల నజర్
అరెస్టయిన నిందితుల్లో కొందరిపై గతంలోనూ వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. ముఖ్యంగా పోలివెంప సుధీర్పై పామర్రు, హనుమాన్ జంక్షన్, పటమట, ఉయ్యూరు రూరల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు.
గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై మరింత కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచేందుకు ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని, అనుమానాస్పద కార్యకలాపాలపై సమాచారం అందించాలని కోరారు. స్వాధీనం 1.340 కిలోల గంజాయి, రెండు మోటార్ సైకిళ్లు, మూడు సెల్ఫోన్లు.




