Penamaluru: రూ.2.15 కోట్లతో కోలవెన్ను–నెప్పల్లి రోడ్డు పనులకు శంకుస్థాపన!
Penamaluru: పెనమలూరు నియోజకవర్గంలో ఈ వారంలోనే రూ.12 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నామని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు.
Penamaluru: రూ.2.15 కోట్లతో కోలవెన్ను–నెప్పల్లి రోడ్డు పనులకు శంకుస్థాపన!
పెనమలూరు: కంకిపాడు మండలం కోలవెన్ను గ్రామంలో రూ.2.15 కోట్ల SASCI నిధులతో నిర్మించనున్న కోలవెన్ను–నెప్పల్లి లింక్ రోడ్డు నిర్మాణ పనులకు పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బోడే ప్రసాద్ గారు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు మాట్లాడుతూ...గత రెండున్నర సంవత్సరాలుగా పెనమలూరు నియోజకవర్గంలో సంక్షేమంతో పాటు అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇస్తూ పనులను వేగంగా ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు,‘పల్లె పండుగ’ కార్యక్రమం ద్వారా గ్రామాల నుంచి తాడిగడప,ఉయ్యూరు మున్సిపాలిటీల వరకు రోడ్లు,కనెక్టివిటీ,మౌలిక వసతుల అభివృద్ధి పెద్ద ఎత్తున కొనసాగుతోందన్నారు.
ఈ వారంలో రూ.12 కోట్ల అభివృద్ధి పనులు
కోలవెన్ను–నెప్పల్లి లింక్ రోడ్డుకు రూ.2.15 కోట్లతో శంకుస్థాపన చేయగా,గొడవర్రు లిక్కర్ ఫ్యాక్టరీ రోడ్డు పనులను ఇప్పటికే ప్రారంభించామని,రేపు సుమారు రూ.2 కోట్లకు పైగా వ్యయంతో మూర్తిరాజుగూడెం–కుందేరు రోడ్డు పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు,ఈ ఒక్క వారంలోనే సుమారు రూ.12 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టబోతున్నామని వెల్లడించారు...
కోలవెన్ను గ్రామానికి రూ.1.32 కోట్లతో అభివృద్ధి పనులు
కోలవెన్ను గ్రామంలో ఉపాధి హామీ పథకం (NREGS) ద్వారా రూ.67 లక్షలు,విలేజ్ హెల్త్ క్లినిక్కు రూ.55 లక్షలు,కాంపౌండ్ వాల్ నిర్మాణానికి రూ.10 లక్షలు కలిపి మొత్తం రూ.1.32 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. అదనంగా గ్రామాభివృద్ధికి పంచాయతీ నిధులు రూ.1.26 కోట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
రోడ్ల పునర్నిర్మాణానికి ప్రాధాన్యత
గతంలో గుంతలమయంగా మారిన రోడ్లకు తాత్కాలికంగా ప్యాచ్ వర్కులు చేపట్టి,ప్రస్తుతం పూర్తిగా దెబ్బతిన్న రోడ్లను పూర్తిస్థాయిలో పునర్నిర్మించే పనులను వేగవంతం చేశామని ఎమ్మెల్యే గారు తెలిపారు.
మద్దూరు రోడ్డు పనులు పూర్తయ్యాయని, పునాదిపాడు రోడ్డు పనులు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు,తెన్నేరు, వేల్పూరు–ఉప్పులూరు,తోట్లవల్లూరు రోడ్డు పనులను కూడా ఈ నెల రోజుల్లో ప్రారంభించి యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
రోజుకో అభివృద్ధి నివేదిక ప్రజల ముందుకు
పెనమలూరు నియోజకవర్గంలో దాదాపు 1,000కు పైగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే గారు తెలిపారు, గ్రామాల్లో ఏ పనికి ఎంత ఖర్చు చేశామనే పూర్తి వివరాలతో నివేదికలను సిద్ధం చేశామని చెప్పారు.
ఉయ్యూరు,తాడిగడప మున్సిపాలిటీలతో పాటు మూడు మండలాల్లోని గ్రామాలు,వార్డుల వారీగా అభివృద్ధి వివరాలను రోజుకొకటి చొప్పున ప్రెస్,సోషల్ మీడియా ద్వారా ప్రజల ముందుంచుతామని వెల్లడించారు.
డిసెంబర్ నాటికి టిడ్కో ఇళ్ల పంపిణీ
గత ప్రభుత్వ హయాంలో 80–90 శాతం పూర్తయిన టిడ్కో ఇళ్ల పేరుతో లబ్ధిదారుల పేరిట రుణాలు తెచ్చి ప్రభుత్వ ఖజానాకు మళ్లించారే తప్ప,పేదలకు ఇళ్లు అందించలేకపోయారని ఎమ్మెల్యే విమర్శించారు.
రాబోయే డిసెంబర్లోపు అర్హులైన లబ్ధిదారులందరికీ టిడ్కో గృహాలను అందజేస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం పంచాయతీ నిధులను కూడా లాగేసుకుని సర్పంచులను డమ్మీలుగా మార్చిందని ఎమ్మెల్యే గారు ఆరోపించారు,ఐదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పకుండా నేడు ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేయడం హాస్యాస్పదమని విమర్శించారు.
ఒకవైపు సంక్షేమం.. మరోవైపు అభివృద్ధి అనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని,పెనమలూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ప్రగతిపథంలోకి తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని బోడే ప్రసాద్ గారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.




