Sathupalli: సత్తుపల్లిలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
Sathupalli: సత్తుపల్లిలో కేటీఆర్ జన్మదినం సందర్భంగా మెగా రక్తదాన శిబిరం. హాజరైన మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. స్వచ్ఛందంగా రక్తదానం చేసిన 200 మంది.
Sathupalli: సత్తుపల్లిలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
సత్తుపల్లి: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదినాన్ని పురస్కరించుకుని ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని కిరాణా మర్చంట్స్ కళ్యాణ మండపంలో బీఆర్ఎస్ నాయకులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి కేటీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని పరిశీలించి రక్తదాతలను అభినందించారు.
రక్తదాన శిబిరానికి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, కేటీఆర్ అభిమానులు భారీ సంఖ్యలో హాజరై స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. శిబిరంలో దాదాపు 200 మందికి పైగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ.. తలసేమియా బాధితులతో పాటు అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమయ్యే ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా ఈ రక్తాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్కు పంపిస్తున్నామని తెలిపారు.
గతంలో కూడా వెయ్యి మందికి పైగా పాల్గొన్న భారీ రక్తదాన శిబిరాలను నిర్వహించామని గుర్తు చేశారు. ముఖ్య నాయకుల జన్మదినాలను సేవా కార్యక్రమాలతో నిర్వహించడం ద్వారా సమాజానికి ఉపయోగపడటంతో పాటు ఎంతోమంది ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని అన్నారు. అలాగే ఢిల్లీలో నీట్ విద్యార్థులు గత 20 రోజులుగా నిర్వహిస్తున్న దీక్షపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
విద్యార్థులు ఇంతకాలంగా ఆందోళన చేస్తున్నా పట్టించుకోకుండా, ఇప్పుడు రాహుల్ గాంధీ అక్కడికి వెళ్లి రాజకీయ డ్రామా చేయడం విడ్డూరంగా ఉందని సండ్ర వెంకట వీరయ్య విమర్శించారు. చివరగా రక్తదాన శిబిరంలో పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.




