Palwancha: YTPS AHP, CHP ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగుల ఆందోళన!
Palwancha: వైటీపీఎస్ ఏహెచ్పీ, సీహెచ్పీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పాల్వంచలో టీజీపీఈజేఏసీ ఆందోళన. కేటీపీఎస్ చీఫ్ ఇంజనీర్ ఛాంబర్ ముట్టడి.. 45 రోజులుగా కొనసాగుతున్న ఉద్యోగుల నిరసన.
Palwancha: YTPS AHP, CHP ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగుల ఆందోళన!
పాల్వంచ: యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (YTPS)లోని ఏహెచ్పీ (AHP), సీహెచ్పీ (CHP)లను ప్రైవేటీకరించే ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ టీజీపీఈజేఏసీ (TGPEJAC) ఆధ్వర్యంలో ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కేటీపీఎస్ ఏడవ దశ చీఫ్ ఇంజనీర్ శివరాం రెడ్డి ఛాంబర్ను ఉద్యోగులు ముట్టడించి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.
ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. మధ్యాహ్న భోజనాన్ని సైతం నిరసన ప్రదేశంలోనే నిర్వహిస్తూ ఆందోళనను కొనసాగించారు.
ప్రభుత్వ రంగంలోని కీలక విద్యుత్ కార్యకలాపాలను ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్లడం వల్ల ఉద్యోగ భద్రతతో పాటు విద్యుత్ రంగ భవిష్యత్తుపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని టీజీపీఈజేఏసీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.
YTPSలోని AHP, CHPలను ప్రైవేటీకరించే ప్రతిపాదనలపై ఇప్పటికే పలుమార్లు యాజమాన్యానికి తమ అభ్యంతరాలను తెలియజేశామని తెలిపారు. గత 45 రోజులుగా ఉద్యోగులు శాంతియుతంగా వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ, ఇప్పటివరకు టీజీపీఈజేఏసీ ప్రతినిధులను చర్చలకు ఆహ్వానించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు.
YTPSలోని AHP, CHP ప్రైవేటీకరణ ప్రతిపాదనలను వెంటనే ఉపసంహరించుకోవాలని, కీలక విద్యుత్ కార్యకలాపాలను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల ప్రయోజనాలు, ఉద్యోగ భద్రతను కాపాడాలని, ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో యాజమాన్యం వెంటనే చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని కోరారు.
ఈ ఉద్యమంలో విద్యుత్ సంస్థలకు చెందిన గుర్తింపు పొందిన యూనియన్లు, అసోసియేషన్లు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఇంజనీర్లు, కార్మికులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జేఏసీ చైర్మన్ రాజేందర్తో పాటు బ్రహ్మాజీ, మహేష్, రఘువీర్, రాధాకృష్ణ తదితరులు పాల్గొని ఉద్యమానికి మద్దతు తెలిపారు.
YTPS AHP, CHP ప్రైవేటీకరణ ప్రతిపాదనలను ఉపసంహరించుకునే వరకు ఉద్యమాన్ని ఐక్యంగా, శాంతియుతంగా కొనసాగిస్తామని టీజీపీఈజేఏసీ ప్రతినిధులు స్పష్టం చేశారు.




