Kothagudem: వన మహోత్సవంలో అందరూ భాగస్వాములు కావాలి కలెక్టర్ అంకిత్!
Kothagudem: ఇల్లందు క్రాస్రోడ్స్లోని సెంట్రల్ పార్క్లో మొక్కలు నాటిన కలెక్టర్ అంకిత్, DFO సిద్ధార్థ విక్రమ్ సింగ్. నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని పిలుపు.
Kothagudem: వన మహోత్సవంలో అందరూ భాగస్వాములు కావాలి కలెక్టర్ అంకిత్!
Kothagudem: ఇల్లందు క్రాస్రోడ్లోని చలమల శ్రీనివాసరావు మెమోరియల్ సెంట్రల్ పార్క్లో మొక్కలు నాటిన కలెక్టర్
వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో పెద్ద ఎత్తున మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ పిలుపునిచ్చారు. ఇల్లందు క్రాస్రోడ్లోని చలమల శ్రీనివాసరావు మెమోరియల్ సెంట్రల్ పార్క్లో అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అంకిత్, జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ విక్రమ్ సింగ్, కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, పాఠశాల విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి వన మహోత్సవ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. మొక్కలు నాటడం మాత్రమే కాకుండా నాటిన ప్రతి మొక్కను సంరక్షించి, అవి మనుగడ సాగించేలా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మొక్కలకు క్రమం తప్పకుండా నీరు అందించడం, రక్షణ కల్పించడం వంటి చర్యలు చేపట్టాలని సూచించారు.
పాఠశాల విద్యార్థులు మొక్కలు నాటే కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం అభినందనీయమని కలెక్టర్ అన్నారు. విద్యార్థులు తమ ఇళ్ల వద్ద, పాఠశాల ఆవరణల్లో, పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి, అది వృక్షంగా ఎదిగే వరకు సంరక్షిస్తే పర్యావరణ పరిరక్షణలో ఎంతో కీలకమైన మార్పు తీసుకురాగలమన్నారు.
ప్రస్తుత తరంతో పాటు భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు పచ్చదనం ఎంతో అవసరమని తెలిపారు. జిల్లాలోని ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు సమష్టిగా కృషి చేసి వన మహోత్సవ లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, పాఠశాల విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




