Kothagudem: కొత్తగూడెం ప్రజా పాలన సభలో పొలిటికల్ ఫైట్
Kothagudem: కొత్తగూడెం 'ప్రజా పాలన' సదస్సులో తీవ్ర ఉద్రిక్తత. ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రసంగాన్ని అడ్డుకున్న బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ సింధు తపస్వి.
Kothagudem: కొత్తగూడెం ప్రజా పాలన సభలో పొలిటికల్ ఫైట్
Kothagudem: కొత్తగూడెంలోని కొత్తగూడెం క్లబ్ లో ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి సమావేశంను అధికారులు ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పాలకులు ప్రజలను విస్మరించారని, అంతా అవినీతి మయమని విమర్శిస్తూ, ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రసంగిస్తుండగా కొత్తగూడెం కార్పొరేషన్ ఎనిమిదవ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ సింధు తపస్వి అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా, జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్న మీరు అప్పటి ప్రభుత్వాన్ని ఎలా విమర్శిస్తారు అంటూ తాను కూర్చున్న స్థానం నుంచి పెద్దగా అరుస్తూ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఏ ఒక్కటి అమలు చేయడం లేదని గట్టిగా మాట్లాడటంతో ఎమ్మెల్యే కోరం కనకయ్య తీవ్ర అసహనానికి గురయ్యారు.
మాట్లాడుతుంటే అడ్డు తగలడం సమంజసం కాదని, ప్రస్తుత మా ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి చెబుతుంటే ఇందులో మీకు వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. తన ప్రసంగం అయిపోయిన తర్వాత మాట్లాడేందుకు అవకాశం ఇస్తామని, అప్పటి వరకు వేచి ఉండమని చెప్పినప్పటికీ కార్పొరేటర్ అదే మీ పట్టించుకోకుండా పెద్దగా మాట్లాడుతున్న నేపథ్యంలో ఆమెను బయటకు పంపించాలని ఎమ్మెల్యే కోరం కనకయ్య పోలీసులను ఆదేశించారు.
అవసరమైతే ఆమెను బయటికి వెళ్లి ప్రెస్ మీట్ పెట్టుకోమని సలహా ఇచ్చారు. పోలీసులు ఆమెను వారించే ప్రయత్నం చేసినా ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్లనని మహిళా కార్పొరేటర్ సింధు తపస్వి భీష్మించుకుని కూర్చున్నారు.




