Kothagudem: కార్మికోద్యమాలతోనే హక్కుల సాధన కొమరయ్య వర్ధంతిలో కూనంనేని!
Kothagudem: సింగరేణిలో కొమరయ్య 30వ వర్ధంతి వేడుకలు. కార్మికులు అనుభవించే ప్రతి హక్కు వెనుక కొమరయ్య త్యాగం ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని నివాళి.
Kothagudem: కార్మికోద్యమాలతోనే హక్కుల సాధన కొమరయ్య వర్ధంతిలో కూనంనేని!
Kothagudem: సింగరేణి కార్మికుల సంక్షేమం, హక్కుల రక్షణ కోసం జీవితాంతం పోరాడిన యూనియన్ కొమరయ్య సేవలు చిరస్మరణీయమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. కొమరయ్య 30వ వర్ధంతి సందర్భంగా శనివారం సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట ఉన్న ఆయన విగ్రహంతో పాటు కొత్తగూడెం, కార్పొరేట్ ఏరియాల్లోని వివిధ గనులు, విభాగాల వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించి, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ.. కార్మికుల జీవితాల్లో నేడు అమలవుతున్న అనేక సంక్షేమ ఫలాలు కొమరయ్య వంటి నాయకుల త్యాగాల ఫలితమేనన్నారు. పదవీ విరమణ తర్వాత కార్మికులకు గౌరవప్రదమైన జీవనం అందించేందుకు రూ.350తో ప్రారంభమైన పెన్షన్ సాధించి ఆయన పెన్షన్ ప్రదాతగా నిలిచారని, దీపావళి బోనస్ హక్కుగా దక్కేలా పోరాడారని గుర్తుచేశారు.
ఒకే సంస్థలో పనిచేసే కార్మికుల మధ్య వివక్ష ఉండకూడదనే ఉద్దేశంతో కాంట్రాక్ట్ కార్మికుల పర్మినెంట్ కోసం కృషి చేశారని పేర్కొన్నారు. ఆర్ఎల్సీ సమక్షంలో కుదిరిన కీలక ఒప్పందాలను జీర్ణించుకోలేక కొన్ని స్వార్థ కార్మిక సంఘాలు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నాయని, ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ పార్టీ పంచన చేరే సంఘాలు విమర్శలు చేయడం సిగ్గుచేటని, కార్మికుల ప్రయోజనాలను దెబ్బతీసే ఇలాంటి అసత్య ప్రచారాలను తక్షణమే మానుకోవాలని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ సీనియర్ నాయకులు శేషయ్య, కేంద్ర ప్రచార కార్యదర్శి వీరస్వామి, ఏరియా బ్రాంచ్ కార్యదర్శులు జక్కుల గట్టయ్య, రమణమూర్తి, సుధాకర్, ఉపాధ్యక్షులు కత్తర్ల రాములు, క్రిస్టోఫర్ తదితరులు పాల్గొన్నారు.




