Bhadrachalam: ఆదివాసీ నర్స్ శిరీష మృతిపై భద్రాచలం బార్ అసోసియేషన్ నిరసన!
Bhadrachalam: హైదరాబాద్లో ఆదివాసీ నర్స్ ఊకే శిరీష అనుమానాస్పద మృతిపై భద్రాచలం బార్ అసోసియేషన్ కోర్టు ఎదుట నిరసన చేపట్టింది.
Bhadrachalam: ఆదివాసీ నర్స్ శిరీష మృతిపై భద్రాచలం బార్ అసోసియేషన్ నిరసన!
భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చోటీగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీ యువతి, నర్స్ ఊకే శిరీష అనుమానాస్పద మృతి తీవ్ర కలకలం రేపుతోంది. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న శిరీష మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో... ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ భద్రాచలం బార్ అసోసియేషన్ నిరసనకు దిగింది.
శిరీష మృతి వెనుక ఉన్న వాస్తవాలను వెలికితీయాలని డిమాండ్ చేస్తూ భద్రాచలం జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు కాంప్లెక్స్ మెయిన్ గేటు వద్ద బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొడాలి శ్రీనివాసన్, ఉపాధ్యక్షులు సున్నం రమేష్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. శిరీష మృతిపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిష్పక్షపాతంగా, సమగ్రంగా దర్యాప్తు చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు.




