Kothagudem: ముస్లిం మైనారిటీ నేతల చేతుల మీదుగా విగ్రహాల అందజేత!
Kothagudem: భద్రాద్రి కొత్తగూడెంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు, కాంగ్రెస్ నాయకులు 3 వేల మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు.
Kothagudem: ముస్లిం మైనారిటీ నేతల చేతుల మీదుగా విగ్రహాల అందజేత!
Kothagudem: వినాయక చవితి పండుగను పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో పర్యావరణ పరిరక్షణ, మత సామరస్యం, సమైక్యతను చాటేలా ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి గౌరవ శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఆళ్ల మురళి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
భద్రాద్రి జిల్లా కాంగ్రెస్ ముస్లిం మైనారిటీ నాయకుల చేతుల మీదుగా భక్తులకు 3 వేల మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. మత సామరస్యానికి ప్రతీకగా హిందూ, ముస్లిం, క్రైస్తవుల మధ్య ఐక్యతను పెంపొందించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఆళ్ల మురళి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ, ప్రజాస్వామ్య రక్షణ, జలవనరుల కాలుష్య నివారణతో పాటు క్రమశిక్షణతో కూడిన సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తూ స్వచ్ఛమైన ప్రకృతిని భావితరాలకు అందించడమే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ప్రధాన లక్ష్యమని తెలిపారు.
భక్తి పేరుతో ప్రకృతి, జలవనరులు కలుషితం కాకుండా ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని ఆయన పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు.
దేశంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ఆర్థిక, సామాజిక, రాజకీయ ఎదుగుదలను అడ్డుకునేందుకు కుల, మత, ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆళ్ల మురళి విమర్శించారు. రాజ్యాంగ హక్కులు, ఫలాలు ప్రజలకు అందకుండా చేసే కుట్రలపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు.
హిందూ, ముస్లిం, క్రైస్తవుల మధ్య మత సామరస్యం, ఐక్యతను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతోనే ముస్లిం మైనారిటీ నాయకుల చేతుల మీదుగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ జెడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్రావు, డీసీసీ ప్రధాన కార్యదర్శి పెదబాబు, ఉపాధ్యక్షుడు మంద హనుమంతు, కోశాధికారి కోదుమూరి శ్రీనివాసరావు, పరమేష్ యాదవ్, కార్పొరేటర్లు శ్రీమతి జయతి మసూద్, శ్రీమతి శ్రీలక్ష్మి, దావూద్, జాని, కమర్, అన్వర్, ఇమ్రాన్, గోరెబాబు, సత్తిరెడ్డి, బాల, హరి, ఏనుగుల వెంకటరావు, అంతడపుల కృష్ణ, తాటి తిరుమలేశ్, రాజేష్ రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.




