Sultanabad: సుల్తానాబాద్ హైవేపై లారీలో అగ్నిప్రమాదం.. దూకేసిన డ్రైవర్

Sultanabad: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలో నడిరోడ్డుపై వెళ్తున్న మట్టి లోడ్ లారీలో ఆకస్మాత్తుగా ఘోర అగ్నిప్రమాదం జరిగింది.

Srimanthula Kondal, Peddapalli
Published on: 20 May 2026 6:54 PM IST
Sultanabad
X

Sultanabad: సుల్తానాబాద్ హైవేపై లారీలో అగ్నిప్రమాదం.. దూకేసిన డ్రైవర్

Sultanabad: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలో బుధవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కనురెప్పపాటులో జరగాల్సిన పెద్ద ముప్పు తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. నడిరోడ్డుపై వెళ్తున్న ఒక లారీలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగి క్యాబిన్ పూర్తిగా బూడిదైంది.

​అసలేం జరిగిందంటే..?

​స్థానిక రైస్ మిల్లుల సమీపం నుండి మట్టి లోడ్‌తో ఒక లారీ సుల్తానాబాద్ వైపు నుండి కరీంనగర్ మార్గంలో బయలుదేరింది. అయితే, ప్రస్తుతం జిల్లాలో ఎండలు మండిపోతుండటంతో.. ప్రయాణంలో లారీ ఇంజన్ ఒక్కసారిగా తీవ్రమైన వేడికి (Overheating) గురైంది. దీంతో ఇంజన్ భాగం నుండి అకస్మాత్తుగా మంటలు ఎగసిపడ్డాయి.

​చాకచక్యంగా దూకేసిన డ్రైవర్, క్లీనర్

​ఇంజన్ నుండి పొగలు, మంటలు రావడం గమనించిన డ్రైవర్, క్లీనర్ సమయస్ఫూర్తితో వ్యవహరించారు. లారీ కదులుతున్నప్పటికీ.. ప్రాణాలను కాపాడుకునేందుకు తక్షణమే కిందకు దూకేశారు. దీంతో వారికి ఎలాంటి గాయాలు కాకుండా తృటిలో ప్రాణాపాయం తప్పింది.

​తట్టుకోలేనంత వేడి.. వెనకడుగు వేసిన కార్మికులు

​మంటలు చూసిన వెంటనే సమీపంలోని రైస్ మిల్లు కార్మికులు, స్థానికులు స్పందించి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ, భానుడి భగభగలకు తోడు అగ్నికీలలు భారీగా ఎగిసిపడటంతో ఆ వేడిని తట్టుకోలేక వారు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. క్షణాల వ్యవధిలోనే లారీ క్యాబిన్ భాగం పూర్తిగా దగ్ధమైపోయింది.

​రంగంలోకి దిగిన పోలీసులు.. ట్రాఫిక్ క్లియర్

​ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే సుల్తానాబాద్ ఎస్సై చంద్రకుమార్ తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది సహాయంతో మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. అనంతరం రహదారిపై నిలిచిపోయిన లారీని పక్కకు చేయించి, కరీంనగర్-సుల్తానాబాద్ మార్గంలో రాకపోకలను క్రమబద్ధీకరించారు. ప్రాణనష్టం ఏమీ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Srimanthula Kondal, Peddapalli

Srimanthula Kondal, Peddapalli

Next Story