Siricilla: అనామలీస్, నో మ్యాపింగ్ ఓటర్లకు నోటీసులు కలెక్టర్
Siricilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎస్ఐఆర్ అనామలీస్, నో మ్యాపింగ్ ఓటర్లకు నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు.
Siricilla: అనామలీస్, నో మ్యాపింగ్ ఓటర్లకు నోటీసులు కలెక్టర్
సిరిసిల్ల: ప్రత్యేక ఓటర్ సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. ఎస్ఐఆర్లో భాగంగా గుర్తించిన అనామలీస్, నో మ్యాపింగ్ ఓటర్లకు బూత్ లెవల్ అధికారులు నోటీసులు జారీ చేయాలని సూచించారు.
జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మంగళవారం ఈఆర్ఓలు, ఎలక్షన్ సెక్షన్ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో 5,008 నో మ్యాపింగ్ ఓటర్లు, 78,833 అనామలీస్ ఓటర్లు ఉన్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఆయా ఓటర్లకు బీఎల్ఓలు నోటీసులు జారీ చేసి, అవసరమైన వివరాలు సేకరించాలని ఆదేశించారు.
ఓటర్లు ఎన్నికల సంఘం సూచించిన 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకదాన్ని సమర్పించి, మిగతా వివరాలను అందించాలని కలెక్టర్ తెలిపారు. ఆర్డీవోలు తమ పరిధిలోని బీఎల్ఓలకు నోటీసుల జారీ, తదుపరి చేపట్టాల్సిన ప్రక్రియపై సమగ్ర శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు.
ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం ఎస్ఐఆర్ ప్రక్రియను ఎలాంటి లోపాలకు తావులేకుండా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, ఆర్డీవోలు శ్రీధర్ బాబు, కే.ఎస్.బీ. కుమారి, సిరిసిల్ల, వేములవాడ తహసీల్దార్లు మహేష్, జయంత్, కలెక్టరేట్ పర్యవేక్షకులు ప్రవీణ్, ఎలక్షన్ సెక్షన్ అధికారి రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.




