Sircilla: నేత్రదానంతో మరొకరి జీవితంలో వెలుగులు
Sircilla: సిరిసిల్ల జేఎన్టీయూ కళాశాలలో నేత్రదాన అవగాహన సదస్సు నిర్వహించారు. నేత్రదానంతో అంధులకు చూపు ప్రసాదించవచ్చని డీఎంహెచ్ఓ డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ తెలిపారు.
Sircilla: నేత్రదానంతో మరొకరి జీవితంలో వెలుగులు
సిరిసిల్ల: నేత్రదానం ద్వారా మరొకరి జీవితంలో వెలుగులు నింపవచ్చని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ అన్నారు. ప్రజల్లో నేత్రదానంపై అవగాహన పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
41వ నేత్రదాన అవగాహన పక్షోత్సవాలను పురస్కరించుకొని సిరిసిల్ల అగ్రహారంలోని జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నేత్రదాన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డీఎంహెచ్ఓ డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ మాట్లాడుతూ.. నేత్రదానం ద్వారా కార్నియా సంబంధిత అంధత్వంతో బాధపడుతున్న వారికి చూపును అందించే అవకాశం ఉంటుందని తెలిపారు.
నేత్రదానంపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి, అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు, సమాజంలో నేత్రదానంపై చైతన్యం తీసుకురావాలని సూచించారు. ముఖ్యంగా యువత నేత్రదానంపై అవగాహన పెంచుకొని, ఇతరులను చైతన్యవంతులను చేయడంలో ముందుండాలని కోరారు.
కార్యక్రమంలో బ్లైండ్నెస్ కంట్రోల్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ నయీమ్ జహా విద్యార్థులకు నేత్రదానం ప్రాముఖ్యత, విధానం, అర్హతలు, అపోహలు, తీసుకోవాల్సిన చర్యలపై వివరించారు. అనంతరం విద్యార్థులతో నేత్రదాన ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ వెణుగోపాల్, అధ్యాపకులు, విద్యార్థులు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




