Sircilla: యువత మై భారత్ పోర్టల్లో నమోదు కావాలి గడ్డం నగేష్
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో మై భారత్ నమోదుపై అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ సమీక్ష. యువత నైపుణ్యాభివృద్ధి, సేవా అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపు.
Sircilla: యువత మై భారత్ పోర్టల్లో నమోదు కావాలి గడ్డం నగేష్
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శనివారం మై భారత్ జిల్లా సలహా కమిటీ సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) గడ్డం నగేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మై భారత్ నమోదు డ్రైవ్ పురోగతిపై సమీక్షించారు.
యువత మై భారత్ పోర్టల్లో నమోదు చేసుకోవడం ద్వారా జాతీయ, రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు, స్వచ్ఛంద సేవా అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లభిస్తుందని అదనపు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో నమోదు లక్ష్యాలను సాధించేందుకు మండల, గ్రామ స్థాయిలో విస్తృత ప్రచారం చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
మై భారత్ జిల్లా కార్యక్రమ ఉమ్మడి జిల్లా అధికారి గోలి తిరుపతి రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో జూలై 1 నుంచి ఆగస్టు 15 వరకు ఇంటెన్సివ్ నమోదు, అవగాహన డ్రైవ్ కొనసాగుతోందన్నారు. పాఠశాలలు, కళాశాలలు, క్రీడాకారులు, యువజన సంఘాల భాగస్వామ్యంతో మరింత మంది యువతను మై భారత్లో నమోదు చేయనున్నట్లు తెలిపారు.
ఈ సమావేశంలో డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, జడ్పీ సీఈవో వెంకట మాధవరావు, జిల్లా పంచాయతీ అధికారి జయశీల, జిల్లా విద్యాధికారి మొండయ్య, జిల్లా పౌర సంబంధాల అధికారి శ్రీనివాసాచారి, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి రాందాస్, జిల్లా వైద్యాధికారి డా. ఏంజెలా ఆల్ఫ్రెడ్, మై భారత్ జిల్లా కార్యక్రమ అధికారి జి. కిరణ్ కుమార్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు తదితరులు పాల్గొన్నారు.




