Odela: ఓదెల మండలంలో భారీ అగ్నిప్రమాదం.. 60 బస్తాల సీడ్ వడ్లు దహనం
Odela: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఇందుర్తి గ్రామంలో వరి కొయ్యలు తగులబెట్టడంతో భారీ అగ్నిప్రమాదం జరిగింది.
Odela: ఓదెల మండలంలో భారీ అగ్నిప్రమాదం.. 60 బస్తాల సీడ్ వడ్లు దహనం
ఓదెల: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఇందుర్తి గ్రామంలో గురువారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గుర్తుతెలియని రైతులు కొద్దిరోజుల క్రితం కోసిన వరి కొయ్యలను తగులబెట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. కొయ్యలకు అంటించిన మంటలు ఒక్కసారిగా వచ్చిన గాలికి ఎగసిపడి, పక్కనే పంట చేనులో ఆరబోసి ఉంచిన సీడ్ (విత్తన) ధాన్యం కుప్పలకు అంటుకున్నాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో నలుగురు రైతులకు చెందిన సుమారు 60 బస్తాల విత్తన ధాన్యం పూర్తిగా కాలి బూడిదయ్యింది. మార్కెట్లో ఎంతో డిమాండ్ ఉన్న సీడ్ వడ్లు కావడంతో దాదాపు 20 లక్షల రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు.
మంటలు ఎగసిపడటాన్ని గమనించిన స్థానిక రైతులు వెంటనే అప్రమత్తమయ్యారు. సమయస్ఫూర్తితో ట్రాక్టర్లపై వాటర్ ట్యాంకులను తీసుకువచ్చి మంటలను అదుపు చేయడంతో పక్కనే ఉన్న మిగతా ధాన్యం కుప్పలు సురక్షితంగా బయటపడ్డాయి. లేదంటే నష్టం మరింత ఎక్కువగా ఉండేదని రైతులు తెలిపారు. కంటికి రెప్పలా కాపాడుకున్న పంట చేతికందే సమయంలో బూడిదవడంతో బాధిత రైతులు తలడిల్లిపోతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు.




