Karimnagar: ధాన్యం కొనుగోళ్లపై కాంగ్రెస్ సర్కార్పై రసమయి బాలకిషన్ ఫైర్!
Karimnagar: ఐకేపీ కేంద్రాల వద్ద ధాన్యం కొనుగోళ్ల ఆలస్యం, తరుగు పేరుతో జరుగుతున్న దోపిడీపై మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Karimnagar: ధాన్యం కొనుగోళ్లపై కాంగ్రెస్ సర్కార్పై రసమయి బాలకిషన్ ఫైర్!
కరీంనగర్: ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు కేంద్రాల్లోనే ఉంటూ వడదెబ్బకు గురవుతూ చనిపోతున్నారని, అలాగే కొందరు రైతులు మనోవేదనతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఈ చావులన్నీ ప్రభుత్వ హత్యలేనని మానకొండూర్ మాజీ ఎమ్మల్యే రసమయి బాలకిషన్ ఆరోపించారు.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం వేయడం లేదని, తూకం వేసిన బ్యాగులను మిల్లుల్లోకి తరలించేందుకు రవాణా సౌకర్యం సరిగా లేదని, దీంతో రైతులు దినమంతా కేంద్రాల్లోనే ఉండిపోతున్నారని రసమయి అన్నారు.
కొనుగోలు కేంద్రాల్లో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని, చాలా మంది వడదెబ్బకు, మనోవేదనకు గురై చనిపోతున్నారని, ప్రభుత్వానికి రైతుల ఉసురు తగులుతుందని ఆయన మండిపడ్డారు. రాష్ర్టంలో ఏ గ్రేడ్ ధాన్యం పండలేదా అంటూ ఆయన ప్రశ్నించారు. బీ గ్రేడ్ పేరుతో ధాన్యం కొనుగోలు చేస్తూ ప్రభుత్వమే దోపిడీ చేస్తుందని, తరుగుపేరుతో బస్తాకు మూడు కిలోలు కోత విధిస్తూ రైతులను మిల్లర్లు, ప్రభుత్వం దోచుకుంటుందని ఆరోపించారు.
నియోజకవర్గంలో మొక్కజొన్న, పొద్దు తిరుగుడు పంటను ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని, రైతులు నెలల తరబడి వేచి చూసి తిరిగి ఇండ్లలోకి పంటను తీసుకెళ్తున్నారని తెలిపారు. రైతులకు ఇంతటి దయనీయ పరిస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని రసమయి ఆరోపించారు. మానకొండూర్ ఎమ్మెల్యే రైతులపట్ల, ధాన్యం పట్ల సోయి లేదని, ఏం చేస్తున్నాడని ఆయన ప్రశ్నించారు. రైతులు చనిపోతే కనీసం ఎమ్మెల్యే పరామర్శించే పరిస్థితి లేదన్నారు.
ఇప్పటికైనా ఎమ్మెల్యే, అధికారులు స్పందించి వెంటనే వడ్లను, మొక్కజొన్నను, పొద్దు తిరుగుడును కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షులు రావుల రమేష్,రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, పాశం అశోక్ రెడ్డి,వంతడుపుల సంపత్,ఎలుక ఆంజనేయులు,పొన్నం అనిల్ గౌడ్, సంగుపట్ల మల్లేశం,పాకాల మైపాల్ రెడ్డి, లింగాల లక్ష్మణ్, గంప వెంకన్న,బోయిని కొమురయ్య,కనకం కొమురయ్య, బోయిని తిరుపతి,బిఅర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.




