Sircilla: సిరిసిల్ల: గంజాయి బాధితుల కోసం ఎస్పీ కీలక నిర్ణయం!
Sircilla: గంజాయి వ్యసన నిర్మూలనకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. డీ-అడిక్షన్ సెంటర్కు క్యారం, చెస్ బోర్డులను ఎస్పీ మహేష్ బి. గితే అందజేశారు.
Sircilla: సిరిసిల్ల: గంజాయి బాధితుల కోసం ఎస్పీ కీలక నిర్ణయం!
సిరిసిల్ల: జిల్లాలో గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాల నిర్మూలనతో పాటు వ్యసనానికి గురైన వారిని సాధారణ జీవితంలోకి తీసుకురావడానికి జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ సుమన్ రావుకు డీ-అడిక్షన్ సెంటర్లో చికిత్స పొందుతున్న బాధితుల కోసం క్యారం, చెస్ బోర్డులను జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే శుక్రవారం అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, డీ-అడిక్షన్ సెంటర్లో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్య సేవలు, అవసరమైన సౌకర్యాలు కల్పించి వారు త్వరగా కోలుకుని సాధారణ జీవితంలోకి చేరేలా వైద్య సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
గంజాయి వ్యసనానికి బానిసై ఆ అలవాటు నుంచి బయటపడాలని కోరుకునే వారు స్వచ్ఛందంగా పోలీసు శాఖను సంప్రదించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. వారికి కౌన్సెలింగ్ నిర్వహించి, డీ-అడిక్షన్ సెంటర్లో నిపుణుల పర్యవేక్షణలో చికిత్స అందించి తిరిగి సమాజంలో గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేలా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.
జిల్లాలో గంజాయి విక్రయాలు, రవాణా, వినియోగంపై కఠిన చర్యలు కొనసాగుతున్నాయని, వ్యసనానికి సంబంధించిన సమాచారం తెలిసినా లేదా స్వయంగా మానలేని పరిస్థితిలో ఉన్న వారి వివరాలు తెలిసినా వెంటనే సమీప పోలీసు అధికారులకు సమాచారం అందించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆర్.ఐ (అడ్మిన్) సురేష్, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు పాల్గొన్నారు.




