Sircilla: సిరిసిల్లలో ఘనంగా ప్రజాకవి కాళోజీ జయంతి వేడుకలు!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీ స్టడీ సర్కిల్లో ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని ఘనంగా నిర్వహించి, ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.
Sircilla: సిరిసిల్లలో ఘనంగా ప్రజాకవి కాళోజీ జయంతి వేడుకలు!
Sircilla: తెలంగాణ భాష, యాస, గోసను తన రచనల్లో ప్రతిబింబించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావును నేటి తరం స్మరించుకోవాలని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జెల్ల వెంకటస్వామి అన్నారు. కాళోజీ జయంతి సందర్భంగా బీసీ స్టడీ సర్కిల్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జెల్ల వెంకటస్వామి మాట్లాడుతూ.. “పుట్టుక నీది.. చావు నీది.. బ్రతుకంతా దేశానిది” అంటూ కాళోజీ చెప్పిన మాటలు ఆయన జీవిత తత్వాన్ని ప్రతిబింబిస్తాయని అన్నారు. కాళోజీ రాసిన ‘నా గొడవ’ కేవలం ఆయన వ్యక్తిగత గొడవ కాదని, అది సమాజం బతుకు గొడవ అని పేర్కొన్నారు.
నిజాం నిరంకుశ పాలనలో ప్రజలు అనుభవించిన కష్టాలు, బాధలను తన రచనల ద్వారా కాళోజీ ప్రపంచానికి తెలియజేశారని అన్నారు. అన్యాయాన్ని ఎదిరిస్తూ నిక్కచ్చిగా నిలబడి, ప్రజల పక్షాన తన గళాన్ని వినిపించిన ధైర్యశాలి కాళోజీ అని కొనియాడారు.
తెలంగాణ భాష, యాస, సంస్కృతి, ప్రజల జీవన విధానానికి కాళోజీ చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాలు, రచనలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ స్టడీ సర్కిల్ సిబ్బంది హరీష్, సురేష్, కిరణ్మయి, దివ్య, బాలకిషన్, మురళి, అనితతో పాటు విద్యార్థులు పాల్గొని ప్రజాకవి కాళోజీ నారాయణరావుకు ఘన నివాళులర్పించారు.




