Karimnagar: తప్పిపోయిన వ్యక్తిని కుటుంబానికి అప్పగించిన రూరల్ పోలీసులు!
Karimnagar: కుటుంబ తగవులతో ఇంటి నుంచి వెళ్లిపోయిన కరీంనగర్కు చెందిన గోచిపాకల శ్రీనుబాబు ఆచూకీని పోలీసులు కనిపెట్టారు.
Karimnagar: తప్పిపోయిన వ్యక్తిని కుటుంబానికి అప్పగించిన రూరల్ పోలీసులు!
కరీంనగర్: కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హనుమాన్నగర్, తిగలగుట్టపల్లికి చెందిన గోచిపాకల శ్రీనుబాబు (26) లేబర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతను నెల్లూరు జిల్లా కావలి ప్రాంతానికి చెందిన గోచిపాకల స్వర్ణను ప్రేమ వివాహం చేసుకోగా, వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
గత సుమారు ఐదు సంవత్సరాల క్రితం జీవనోపాధి కోసం కరీంనగర్కు వచ్చి, తిగలగుట్టపల్లిలోని హనుమాన్నగర్లో అద్దె ఇంట్లో నివాసం ఉంటూ కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నారు. కుటుంబ విషయాలపై భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో శ్రీనుబాబు ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం కడప, గుంటూరు, విజయవాడ, నెల్లూరు ప్రాంతాల్లో కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నాడు.
శ్రీనుబాబు ఆచూకీ తెలియకపోవడంతో అతని భార్య మే 9వ తేదీన కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి అతని ఆచూకీ కోసం పలు విధాలుగా ప్రయత్నించారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ముఖ్యంగా ఆంధ్ర–రాయలసీమ ప్రాంతాల్లో అతని ఫొటోతో పత్రికా ప్రకటన విడుదల చేసి సమాచారం అందించాలని కోరారు. ఈ ప్రకటనను చూసిన ఒక వ్యక్తి శ్రీనుబాబును గుర్తించి, పోలీసులు తెలిపిన ఫోన్ నంబర్కు సమాచారం అందించారు. దీంతో కరీంనగర్ రూరల్ పోలీసులు వెంటనే అతనితో ఫోన్లో మాట్లాడి, అతని ఆచూకీని నిర్ధారించారు. అక్కడి పోలీసుల సహాయంతో శ్రీనుబాబును ఈరోజు కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి విచారించారు.
విచారణలో కుటుంబ సభ్యులతో గొడవ జరగడంతో మనస్తాపానికి గురై ఇంటి నుంచి వెళ్లిపోయానని శ్రీనుబాబు తెలిపాడు. తనపై కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైన విషయం తనకు తెలియదని, తన ఇద్దరు పిల్లలపై ప్రేమతో వారిని చూడాలనే ఉద్దేశంతో పోలీస్ స్టేషన్కు వచ్చినట్లు తెలిపాడు. అనంతరం శ్రీనుబాబు భార్యను పోలీస్ స్టేషన్కు పిలిపించి, భార్యాభర్తల మధ్య ఉన్న కుటుంబ సమస్యలపై కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇద్దరూ కలిసి ఉండాలని, తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కుటుంబంతో సంతోషంగా జీవించాలని పోలీసులు సూచించారు. అనంతరం భార్యాభర్తలను కలిపి వారి ఇంటికి పంపించినట్లు రూరల్ సిఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.




