Sircilla: అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు నిషేధం!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా సెప్టెంబర్ 1 నుండి 30 వరకు పోలీస్ యాక్ట్ అమలు. ముందస్తు అనుమతి తప్పనిసరి.
Sircilla: అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు నిషేధం!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా సెప్టెంబర్ 1 నుంచి 30వ తేదీ వరకు నెల రోజుల పాటు పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని పోలీస్ యాక్ట్–1861 ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేకుండా జిల్లాలో ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించరాదని ఎస్పీ స్పష్టం చేశారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా డీజేలను వినియోగించవద్దని సూచించారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడటంతో పాటు ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే ఎలాంటి చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడరాదని జిల్లా ప్రజలకు ఎస్పీ సూచించారు. పోలీస్ యాక్ట్ అమలులో ఉన్న సమయంలో ప్రజలు నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని కోరారు. జిల్లాలో శాంతిభద్రతలను కాపాడేందుకు నిరంతరం విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని ఎస్పీ మహేష్ బి. గితే విజ్ఞప్తి చేశారు.




