Choppadandi: చొప్పదండి ప్రజల కల నిజమైంది.. 15 రోజుల్లోనే కొత్త రోడ్డు నిర్మాణం!
Choppadandi: కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలో రూ. 50 లక్షల సుడా నిధులతో కోనేరుపల్లి-కొక్కెరకుంట రహదారి నిర్మాణానికి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం శంకుస్థాపన చేశారు.
Choppadandi: చొప్పదండి ప్రజల కల నిజమైంది.. 15 రోజుల్లోనే కొత్త రోడ్డు నిర్మాణం!
కరీంనగర్ జిల్లా: చొప్పదండి మండలంలో కోనేరుపల్లి నుంచి కొక్కెరకుంట మోతే బ్రిడ్జి వరకు నిర్మించనున్న రహదారి పనులకు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తో కలిసి చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కోనేరుపల్లి, కాట్నాపల్లి, సాంబయ్యపల్లి, మల్లన్నపల్లి గ్రామాలతో పాటు సమీపంలోని చిట్యాలపల్లి, రేవెల్లి తదితర గ్రామాల ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఈ రహదారి నిర్మాణాన్ని కోరుతున్నారని తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో పలుమార్లు విజ్ఞప్తులు చేసినప్పటికీ ఈ సమస్యకు పరిష్కారం లభించలేదని పేర్కొన్నారు.
ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ రహదారిని మొదటి ప్రాధాన్యతగా గుర్తించామని, సుమారు రూ.50 లక్షల సుడా (SUDA) నిధులతో రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఈ రహదారి పూర్తయితే పలు గ్రామాల ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం అవుతాయని తెలిపారు.
రోడ్డు నిర్మాణ పనులను 15 రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, అవసరమైతే అదనపు నిధులను సుడా లేదా ప్రభుత్వ వర్గాల నుంచి సమీకరించి పనులు పూర్తిచేస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు.
అలాగే చొప్పదండి మండల అభివృద్ధికి ప్రభుత్వం తరఫున మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టి ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించేందుకు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.




