Gambhiraopet: కరెంట్ సరఫరా సక్రమంగా చేయాలంటూ రైతుల రాస్తారోకో..!
Gambhiraopet: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట సబ్స్టేషన్ ఎదుట రైతులు ఆందోళనకు దిగారు.
Gambhiraopet: కరెంట్ సరఫరా సక్రమంగా చేయాలంటూ రైతుల రాస్తారోకో..!
గంభీరావుపేట: విద్యుత్ కోతలతో పంటలకు సాగునీరు అందడం లేదంటూ గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన రైతులు ఆందోళనకు దిగారు. లింగన్నపేట సబ్స్టేషన్ ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు.
వేళాపాళా లేని విద్యుత్ సరఫరాతో పొలాలకు నీరు అందించుకోలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సరిపడా విద్యుత్ అందక పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. నాణ్యమైన విద్యుత్ను సక్రమంగా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.
రైతుల ధర్నాతో ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. విద్యుత్ సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
పోలీసుల హామీతో రైతులు ఆందోళన విరమించారు. అయితే విద్యుత్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు.




