Karimnagar: కళాకారుల పాటలు ప్రజల కోసం ఉండాలి: సిపిఐ నేత చాడ వెంకటరెడ్డి పిలుపు
Karimnagar: కరీంనగర్లోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో తెలంగాణ ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కళాకారుల శిక్షణ శిబిరం ప్రారంభమైంది.
Karimnagar: కళాకారుల పాటలు ప్రజల కోసం ఉండాలి: సిపిఐ నేత చాడ వెంకటరెడ్డి పిలుపు
కరీంనగర్: సమాజంలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని మానవీయ కోణంలో ఆలోచించే విధంగా పాటలు రావాలని, ప్రజల జీవన ప్రమాణ స్థితిగతులపై కళాకారులు పాటలు పాడాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు,మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి కళాకారులకు పిలుపునిచ్చారు.
కరీంనగర్ లోని బద్దం ఎల్లారెడ్డి భవన్ లో తెలంగాణ ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో రెండు రోజులపాటు జరిగే ఉమ్మడి కరీంనగర్ జిల్లా కళాకారుల శిక్షణ శిబిరాన్ని ముఖ్య అతిథిగా హాజరైన చాడ వెంకటరెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ కళాకారుల గళం,కలం నుండి ప్రజల ఇతి హాసాలు, వారి జీవిన శైలి, కష్ట,సుఖాలు కళ్ళకు కట్టినట్లు ప్రతిబింబించే విధంగా రచనలు,పాటలు ఉండాలన్నారు.
ఆనాడు నిజాం నవాబ్ రజాకార్ల ఆగడాలను ఎదిరించడానికి బండెనక బండి గట్టి పదహారు బండ్లు గట్టి ఏ బండ్లో పోతావ్ కొడుకో నైజాం సర్కారోడా అనే పాట ప్రజల గుండెల్లో ఆలోచనలు రేకెత్తించాయని,అదే తరహా లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన అనేక పోరాటాలకు ఊతమిచ్చింది, ఊపిరి పోసింది పాటేనని, కళాకారులేనని,ప్రజానాట్యమండలి కళాకారులు కూడా వారి ఆటా,పాటలతో ఉద్యమాలకు ఊపిరి పోసారని అన్నారు.
సందర్భాన్ని బట్టి పాటలు పాడాలని,పాలకులు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తే వాటిపై ప్రజలను చైతన్యవంతం చేయడానికి పాట తూటాలాగా మారాలని, కళ కల కోసం కాదు ప్రజల కోసం అనే నినాదాన్ని నిజం చేయడానికి అన్ని రంగాల కళాకారులు కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కళాకారుడిపై ఉందని వెంకటరెడ్డి పిలుపునిచ్చారు.కళాకారులకు పుట్టినిల్లులాంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కళారంగాన్ని ముందుకు తీసుకెళ్లాలని అందుకు ఈ శిక్షణా శిబిరం ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహ, సిపిఐ కరీంనగర్,పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల కార్యదర్శులు పంజాల శ్రీనివాస్, తాండ్ర సదానందం,మంద సుదర్శన్, ఇప్టా జాతీయ కౌన్సిల్ సభ్యులు కవ్వంపల్లి స్వామి, ప్రజానాట్య మండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు కన్నం లక్ష్మీనారాయణ,జిల్లా కార్యదర్శి దుడ్డేల సమ్మయ్య,సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె స్వామి, బోయిని అశోక్, కసిరెడ్డి సురేందర్ రెడ్డి, గూడెం లక్ష్మీ,కళాకారులు వరకోలు సదయ్య,ఏ.రాజయ్య,కోమల, సరిత, రమ,విజయ్,ఎస్.రాములు, రాజం,తదితరులు పాల్గొన్నారు.




