Karimnagar: ప్రశాంతంగా గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలి: సీపీ గౌష్ ఆలం
Karimnagar: కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో గణేష్ ఉత్సవాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేశామని, మండపాల వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరి అని సీపీ గౌష్ ఆలం తెలిపారు.
Karimnagar: ప్రశాంతంగా గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలి: సీపీ గౌష్ ఆలం
కరీంనగర్: వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన వేడుకలను కమిషనరేట్ వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ బందోబస్తు చర్యలు చేపట్టినట్లు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు. గణేష్ ఉత్సవాల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించిన సందర్భంగా సీపీ పలు కీలక ఆదేశాలు, సూచనలు జారీ చేశారు.
కంట్రోల్ రూమ్ & సీసీ నిఘా:...
పోలీస్ కమిషనరేట్ ప్రధాన కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ ద్వారా ముఖ్య కూడళ్లు, సమస్యాత్మక ప్రాంతాలు, నిమజ్జన మార్గాల్లో సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా కొనసాగుతుందని సీపీ తెలిపారు.
మండపాల వద్ద జాగ్రత్తలు...
ప్రతి గణేష్ మండపం వద్ద నిర్వాహకులు తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి. వాలంటీర్లు 24 గంటలూ మండపం వద్ద అందుబాటులో ఉంటూ పోలీసులకు సహకరించాలి. మండపాల వద్ద పోలీస్, ఫైర్, విద్యుత్ శాఖల ఎమర్జెన్సీ ఫోన్ నంబర్ల బోర్డులను ప్రదర్శించాలి.
నిమజ్జన ప్రాంతాల్లో బందోబస్తు...
మానకొండూరు, కొత్తపల్లి, చింతకుంట తదితర ప్రధాన నిమజ్జన ఘాట్ల వద్ద పటిష్ట బందోబస్తు, తగినన్ని భారీ క్రేన్లు, నిరంతర విద్యుత్ దీపాలు, ముందస్తుగా గజ ఈతగాళ్లను (స్విమ్మర్లు) సిద్ధంగా ఉంచుతున్నామ్మన్నారు.
ట్రాఫిక్ క్రమబద్ధీకరణ & రూట్ మ్యాప్..
విగ్రహాల ఊరేగింపు సాగే మార్గాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు రూట్ మ్యాప్ను అమలు చేస్తున్నారు. రోడ్లకు అడ్డంకిగా ఉండే విద్యుత్ వైర్లు, చెట్ల కొమ్మలను సంబంధిత శాఖల ద్వారా తొలగించారని తెలిపారు.
అనుమానిత సమాచారం కోసం డయల్ 112 సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు, వదంతులు వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు ఉంటాయని సీపీ హెచ్చరించారు. ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే తక్షణమే 'డయల్ 100' లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
గణేష్ నవరాత్రులను భక్తిశ్రద్ధలతో, చట్టపరమైన నిబంధనలు పాటిస్తూ విజయవంతం చేయాలని కమిషనర్ గౌష్ ఆలం ప్రజలను, ఉత్సవ కమిటీ సభ్యులను కోరారు.




