Karimnagar: వర్షపు నీటి ప్రాంతాలను పరిశీలించిన సీపీ గౌస్ ఆలం
Karimnagar: కరీంనగర్ తిగలగుట్టపల్లి రైల్వే బ్రిడ్జి, బొమ్మకల్ ఫ్లైఓవర్ వద్ద నిలిచిన వర్షపు నీరు. సీపీ గౌస్ ఆలం క్షేత్రస్థాయి పరిశీలన, ట్రాఫిక్ దారిమళ్లింపుకు ఆదేశం.
Karimnagar: వర్షపు నీటి ప్రాంతాలను పరిశీలించిన సీపీ గౌస్ ఆలం
కరీంనగర్: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కరీంనగర్ పట్టణ శివార్లలోని తిగలగుట్టపల్లి రైల్వే బ్రిడ్జి, బొమ్మకల్ ఫ్లైఓవర్ పరిసర ప్రాంతాల్లో వర్షపు నీరు నిల్వ ఉండటంతో, ఈరోజు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ అలం ఆయా ప్రాంతాలను ప్రత్యక్షంగా సందర్శించి పరిస్థితిని పరిశీలించారు.
ఈ సందర్భంగా స్థానిక పోలీసు అధికారులకు వర్షపు నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో అవసరమైన చోట ట్రాఫిక్ డైవర్షన్లు ఏర్పాటు చేయాలని, రహదారుల రెండు వైపులా ట్రాఫిక్ సజావుగా సాగేందుకు తగిన చర్యలు చేపట్టాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.
అలాగే, ప్రజలు వర్షాకాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వాహనాలను నెమ్మదిగా, అప్రమత్తంగా నడపాలని, నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో అనవసరంగా వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని పోలీస్ కమిషనర్ సూచించారు.
తిగలగుట్టపల్లి రైల్వే బ్రిడ్జి మరియు బొమ్మకల్ ఫ్లైఓవర్ వద్ద నీరు నిల్వ ఉన్న ప్రాంతాలను పరిశీలించిన సీపీ , సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు చేపట్టాలని సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ రూరల్ ఇన్స్పెక్టర్ కె. నిరంజన్ రెడ్డి, ఎస్సై లక్ష్మారెడ్డి మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.




