Karimnagar: సీఎం ఒక మాట.. సీఎస్ మరో మాట యూనిఫామ్లపై ఇదేం గందరగోళం?
Karimnagar: రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ రెండు జతల యూనిఫామ్లను వెంటనే అందించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డిమాండ్ చేశారు.
Karimnagar: సీఎం ఒక మాట.. సీఎస్ మరో మాట యూనిఫామ్లపై ఇదేం గందరగోళం?
కరీంనగర్: ప్రభుత్వ, ఎయిడెడ్, రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ రెండు జతల యూనిఫామ్లను వెంటనే అందించాలని సిపిఎం కరీంనగర్ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరంలో ప్రతి విద్యార్థికి రెండు జతల యూనిఫామ్లు అందజేస్తామని ప్రకటించినప్పటికీ, జూలై నెలాఖరు సమీపిస్తున్నా జిల్లాలోని అనేక పాఠశాలల్లో ఇప్పటికీ యూనిఫామ్లు విద్యార్థులకు అందలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశాఖ, ఎస్సీఈఆర్టీ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్లు, మధ్యాహ్న భోజన ఏర్పాట్లు జూన్ 15లోపు పూర్తి చేయాలని స్పష్టమైన గడువు విధించినా, ఆ లక్ష్యం అమలు కాలేదన్నారు.
యూనిఫామ్ల పంపిణీలో తీవ్ర జాప్యం కారణంగా వేలాది మంది విద్యార్థులు ఇప్పటికీ పాత దుస్తులతోనే పాఠశాలలకు హాజరవుతున్నారని తెలిపారు. బడుగు, బలహీన వర్గాలు,దారిద్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాల పిల్లలే ప్రభుత్వ బడుల్లో చదువుతున్నారన్నారు.వస్త్రం ఎప్పుడు వస్తుంది? టైలరింగ్ ఎప్పుడు పూర్తవుతుంది? విద్యార్థులకు యూనిఫామ్లు ఎప్పుడు అందుతాయి? అనే ప్రశ్నలకు ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వడం లేదని విమర్శించారు.
ఆగస్టు 15లోపు యూనిఫామ్లు అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటిస్తుండగా,ఆగస్టు 24 వరకు పంపిణీ పూర్తవుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చెప్పడం ప్రజల్లో, విద్యార్థుల తల్లిదండ్రుల్లో అయోమయం, గందరగోళానికి కారణమవుతోందన్నారు. ఒకే అంశంపై ప్రభుత్వ పెద్దలు భిన్నమైన ప్రకటనలు చేయడం వల్ల యూనిఫామ్ల పంపిణీపై స్పష్టత లేకుండా పోయిందని పేర్కొన్నారు.
ప్రభుత్వాలు మారితే యూనిఫామ్ రంగు మార్చుతారా అని ప్రశ్నించారు. విద్యార్థుల విద్యకు, క్రమశిక్షణకు యూనిఫామ్లు ఎంతో అవసరమని, ఇప్పటికే పంపిణీ తీవ్రంగా ఆలస్యమైన నేపథ్యంలో ప్రభుత్వం ఇకపై జాప్యం చేయకుండా వెంటనే వస్త్రాల సరఫరా పూర్తి చేసి కుట్టింపు పనులను వేగవంతం చేసి ప్రభుత్వ, ఎయిడెడ్, రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులకు రెండు జతల యూనిఫామ్ లు వెంటనే అందించాలని వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు.




