Sircilla: సిరిసిల్ల జిల్లాలో ఆగస్టు 15 వేడుకలపై కలెక్టర్ఎ స్పీ సమీక్ష!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆగస్టు 15 స్వాతంత్ర్య వేడుకల పకడ్బందీ నిర్వహణపై కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితె అధికారులతో సమీక్షించారు.
Sircilla: సిరిసిల్ల జిల్లాలో ఆగస్టు 15 వేడుకలపై కలెక్టర్ఎ స్పీ సమీక్ష!
Sircilla: ఈ నెల 15న నిర్వహించనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ మహేష్ బి గితెతో కలిసి సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లపై కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది వేడుకలకు తప్పనిసరిగా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
జెండా ఆవిష్కరణ, వేదిక, గ్రౌండ్ తదితర ఏర్పాట్లను పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలని సూచించారు. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిబింబించేలా స్టాల్స్, శకటాలను ఏర్పాటు చేయాలని తెలిపారు.
దేశభక్తిని ప్రతిబింబించేలా విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేసేందుకు ప్రతిపాదనలు నిర్ణీత గడువులోగా సమర్పించాలని సూచించారు.
ముఖ్య అతిథి ప్రసంగం కోసం జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సంక్షిప్త నివేదికలను జిల్లా పౌర సంబంధాల అధికారికి అందజేయాలని ఆదేశించారు. జిల్లాకు చెందిన ప్రముఖులు, వివిధ రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న వ్యక్తులు వేడుకలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
వేడుకల సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని, హాజరయ్యే ప్రజలు, అధికారులు, విద్యార్థులకు సరిపడా తాగునీటి వసతి కల్పించాలని సూచించారు. స్వశక్తి మహిళా సంఘాల ప్రతినిధులు కూడా వేడుకల్లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, డీఆర్వో జయశ్రీ, సిరిసిల్ల ఆర్డీఓ శ్రీధర్ బాబు, వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.




