Sircilla: చేయూత పింఛన్ దరఖాస్తుల ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి

Sircilla: చేయూత పింఛన్ల దరఖాస్తులను ఈ నెల 31 వరకు పకడ్బందీగా స్వీకరించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశం. అర్హతలు, ధ్రువీకరణ పత్రాల వివరాలు.

KALEEM, SIRICILLA
Published on: 13 Aug 2026 9:45 PM IST
Sircilla
X

Sircilla: చేయూత పింఛన్ దరఖాస్తుల ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి

సిరిసిల్ల: చేయూత పింఛన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 31వ తేదీ వరకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించాలని సూచించారు.

జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో వివిధ శాఖల అధికారులతో గురువారం కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, తలసేమియా, సికిల్ సెల్, హిమోఫీలియా బాధితులు, గీత కార్మికులు, నేత కార్మికులు, పైలేరియా, డయాలసిస్ బాధితులకు సంబంధించిన పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ, ఏర్పాట్లపై చర్చించారు.

అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో దరఖాస్తుల స్వీకరణ కేంద్రాల్లో అవసరమైన వసతులు కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. దరఖాస్తుదారులకు ఫారాలు, అవసరమైన పత్రాలపై పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి దరఖాస్తుతో ఆధార్ కార్డు, వయసు ధ్రువీకరణ పత్రం, రేషన్ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, బ్యాంక్ పాస్‌బుక్ జత చేయాలని తెలిపారు.

వితంతువులు భర్త మరణ ధ్రువీకరణ పత్రం సమర్పించాలని, ఒంటరి మహిళలు గ్రామీణ ప్రాంతాల్లో 30 ఏళ్లు, పట్టణ ప్రాంతాల్లో 35 ఏళ్ల వయసు కలిగి ఉండాలని తెలిపారు. గీత కార్మికులు 50 ఏళ్ల వయసు కలిగి ఉండటంతో పాటు ఎక్సైజ్ శాఖ ధ్రువీకరణ పత్రం, సంబంధిత సొసైటీలో సభ్యత్వం ఉండాలని స్పష్టం చేశారు. నేత కార్మికులు 50 ఏళ్ల వయసుతో పాటు హ్యాండ్లూమ్ టెక్స్‌టైల్స్ శాఖ గుర్తింపు పత్రం కలిగి ఉండాలని సూచించారు.

పైలేరియా బాధితులు వైద్య ఆరోగ్య శాఖ ధ్రువీకరణ పత్రం, డయాలసిస్ బాధితులు ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్న వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దివ్యాంగులకు అవసరమైన వైకల్య శాతం కలిగిన యూడీఐడీ పత్రం ఉండాలని, తలసేమియా, సికిల్ సెల్, హిమోఫీలియా బాధితులు కూడా యూడీఐడీ పత్రంతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ప్రత్యేక సదరం శిబిరాలు

దివ్యాంగులు, తలసేమియా, సికిల్ సెల్, హిమోఫీలియా బాధితుల కోసం సిరిసిల్ల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ప్రత్యేక సదరం వైకల్య నిర్ధారణ శిబిరాలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. అర్హులకు సదరం సర్టిఫికెట్లు వేగంగా జారీ చేయాలని, శిబిరాలపై బాధితులకు విస్తృతంగా సమాచారం అందించాలని అధికారులకు సూచించారు.

దరఖాస్తు ఫారాలను జాగ్రత్తగా పూర్తి చేసి, అవసరమైన అన్ని పత్రాలను జత చేయడంతో పాటు ఆన్‌లైన్ ప్రక్రియను కూడా పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ స్పష్టం చేశారు. సమావేశంలో జడ్పీ సీఈవో వెంకట మాధవరావు, డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, వేములవాడ మున్సిపల్ కమిషనర్ లోకేష్, జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story