Sircilla: సమన్వయంతో భూముల రీ సర్వే పూర్తి చేయాలి కలెక్టర్ గరిమ!
Sircilla: భూముల రీ సర్వే, భూ భారతి, సాదాబైనామా, ఎస్ఐఆర్ ప్రక్రియలను సమన్వయంతో వేగవంతం చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
Sircilla: సమన్వయంతో భూముల రీ సర్వే పూర్తి చేయాలి కలెక్టర్ గరిమ!
సిరిసిల్ల: జిల్లాలో భూముల రీ సర్వే ప్రక్రియను రెవెన్యూ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. భూ భారతి, సాదాబైనామా, ఎస్ఐఆర్ ప్రక్రియలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
భూముల రీ సర్వే, భూ భారతి, సాదాబైనామా, ఎస్ఐఆర్ తదితర అంశాలపై కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్తో కలిసి శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. తహసీల్దార్లు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులను ఆయా అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఇప్పటికే సర్వే చేసిన గ్రామాల రికార్డులను సంబంధిత తహసీల్దార్లకు అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. క్షేత్రస్థాయిలో భూముల వివరాలను పక్కాగా సేకరించి, నిర్దేశిత లక్ష్యంతో రీ సర్వేను పారదర్శకంగా పూర్తి చేయాలని సూచించారు.
గ్రామాల్లో సర్వేకు ముందు సర్వే నంబర్ల వివరాలను జీపీఓలు, ఏఈఓలు, పంచాయతీ కార్యదర్శుల ద్వారా ప్రజలకు తెలియజేయాలని తెలిపారు. గ్రామ సరిహద్దుల రీ సర్వేను తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని, సర్వే సమయంలో అటవీ శాఖ అధికారులు కూడా పాల్గొనేలా చూడాలని ఆదేశించారు.
సర్వే పూర్తయిన తర్వాత క్షేత్రస్థాయి వివరాలను రికార్డులతో పరిశీలించి తదుపరి ప్రక్రియ చేపట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములను గుర్తించి, వాటి పరిరక్షణకు పక్కా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రతి తహసీల్దార్ తమ పరిధిలోని సిబ్బంది, సర్వే అధికారులకు భూ భారతి, సాదాబైనామా, రీ సర్వే, ఎస్ఐఆర్ ప్రక్రియలపై పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. నిబంధనల ప్రకారం పనులు చేపట్టాలని, కుల, ఆదాయ తదితర ధృవీకరణ పత్రాలను నిర్ణీత సమయంలో జారీ చేయాలని ఆదేశించారు.
ఎస్ఐఆర్పై ప్రత్యేక దృష్టి
ప్రత్యేక ఓటర్ సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)లో భాగంగా జిల్లాలోని నో మ్యాపింగ్, అనామలీస్ ఓటర్లకు నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. షెడ్యూల్ రూపొందించి, నిబంధనల ప్రకారం ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.
సమీక్ష సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జయశ్రీ, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీఓలు శ్రీధర్ బాబు, కేఎస్బీ కుమారి, ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాస్, కలెక్టరేట్ పర్యవేక్షకులు, ఆయా మండలాల తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.




